నిజామాబాద్ రూరల్, మే 11 : ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధిని మోదీ ప్రభుత్వం విస్మరించిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దేశంలో అశాంతి, అలజడులను సృష్టిస్తున్నదని మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని 87 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భం గా బాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని చెప్పా రు. మన రాష్ట్రంలో విద్వేషం సృష్టిస్తున్న బీజేపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాటిని ఛేదిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
అకాల వర్షాలతో రాష్ట్రంలో నష్టపోయిన రైతుకు రూ.10వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అదే తరహాలో పంట నష్టపోయిన రైతుకు కేంద్రం నుంచి రూ.15 వేలు సాయమందించే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని బాజిరెడ్డి ప్రశ్నించారు. ఎంపీపీ అనూషా ప్రేమ్దాస్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, ప్రధాన కార్యదర్శి అంకల గంగాధర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్, తహసీల్దార్ అనిల్, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్, గిర్దావర్ హరీశ్రెడ్డి, సర్పంచులు లక్ష్మణ్రావు, నవీన్, జిలానీ, కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, కొర్వ లలితా గంగాధర్, సొసైటీ చైర్మన్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.