కామారెడ్డి, ఫిబ్రవరి 12: కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేయడంపై సోమవారం దవాఖాన ఎదుట తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేకపోతే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యులంతా కలిసి డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోగులకు వైద్యం అందించే వరకే వైద్యుల బాధ్యత అని, దవాఖానలో ఎలుకలు ఉండకుండా చూసే బాధ్యత శానిటేషన్ సిబ్బంది, సంబంధిత అధికారులదని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి విచారణ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.