నిజామాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున కంటి పరీక్షల నిర్వహణకు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలన్నీ ఒక్కో గ్రామంలో సుమారు వారం నుంచి పది రోజులపాటు అక్కడే ఉండి ప్రజలందరికీ కంటి పరీక్షలను నిర్వహిస్తాయి. మొదటి విడుతలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చాలా మంది నిరుపేదలకు మేలు జరిగింది. ఉచితంగా అందిన వైద్య సేవలు ఎంతగానో ఉపకరించడంతో ప్రభుత్వం మరో విడుతతో ప్రజల ముందుకు వస్తున్నది. ఈసారి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతోపాటు గ్రామ, పట్టణ స్థాయిలో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందుకోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని వైద్యారోగ్య శాఖ పని చేస్తున్నది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కంటి వెలుగుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో రెండో విడుత కార్యక్రమ సరళి ప్రజల్లోకి చేరింది.
మొదటి విడుతలో ఇలా..
నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుత కంటి వెలుగులో 35 బృందాలు పనిచేశాయి. ఇందులో భాగంగా 33 మండలాల్లో 5లక్షల 22వేల 189 మందికి సాధారణ కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 83వేల 320 మందికి కంటి సమస్యలను గుర్తించి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. దగ్గర చూపు చూడడంలో లోపాలు ఉన్న 67,186 మందిని గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అద్దాలను ఆర్డర్ పెట్టి పంపిణీ చేశారు. 23,029 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు, 246 మందికి కాంప్లికేటెడ్, 1358 మందికి కార్నియా, 6278 మందికి టెరిజీయం, 156 మందికి ైగ్లెకోమా, 170 మందికి ఆమ్లోపియా వంటి సమస్యలను గుర్తించి శస్త్ర చికిత్సలు సైతం చేశారు. ఇక కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 4,83,581 మందికి 20 బృందాలతో కంటి పరీక్షలను పూర్తి చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 3,09,224 మందికి ఎలాంటి ఇబ్బందుల్లేవని వైద్యులు నిర్ధారించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 71,459 మందికి కండ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. కంటి చూపులో తీవ్రమైన సమస్య ఉన్న వారికి హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయించిన కండ్లద్దాలను తెప్పించి 20,894 మందికి అందజేశారు.
ప్రతి రోజూ 120 మందికి పరీక్షలు…
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం 2018, ఆగస్టు 15న ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో నాడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడుత కార్యక్రమంలో మండలానికో బృందాన్ని మాత్రమే నియమించారు. తద్వార పరీక్షలకు సుదీర్ఘ సమయం పట్టింది. రోజుల తరబడి గ్రామాల్లో శిబిరాల ద్వారా మూడు నెలల తరబడి పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మండలానికి రెండేసి చొప్పున బృందాలను నియమించారు. ఒక్కో ఊరికి సుమారుగా 10 రోజుల పాటు సమయం కేటాయించబోతున్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే వారంతా ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడుతలో నిజామాబాద్ జిల్లాలో 70 బృందాలు, కామారెడ్డి జిల్లాలో 44 బృందాలు పని చేయబోతున్నాయి. ఒక్కో బృందం ద్వారా రోజుకు 120 నుంచి 130 మందికి కంటి పరీక్షలు చేసే విధంగా శిక్షణ అందించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కోసం తక్షణ చర్యలకు బృందంలోని వైద్య నిపుణులు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం సమాయత్తం చేసింది.
ఉమ్మడి జిల్లాలో 19 నుంచే…
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం 19 నుంచి అన్ని జిల్లాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కలిసి కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తారు. 19 నుంచి నిరంతరాయంగా కంటి పరీక్షలు కొనసాగుతాయి. వైద్య నిపుణుల కొరత లేకుండా ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. అందుబాటులో ఉన్న కంటి వైద్యులతోపాటుగా కొద్ది మందిని కంటి వెలుగు కార్యక్రమానికి తాత్కాలికంగా నియమించారు. కంటి పరీక్షలు చేసుకున్న వారి వివరాలను నిక్షిప్తం చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను సైతం వైద్యారోగ్య శాఖ నియమించింది. శిబిరాల్లో కంటి పరీక్షలు చేసుకున్న తర్వాత వారి పూర్తి వివరాలను, కంటి సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు.
కంటికి వెలుగు అచ్చింది
కమ్మర్పల్లి, జనవరి 17 : నేను ప్రైవేట్ల పెద్ద కండ్ల దవాఖాన్ల జూపిచ్చుకుంటె మంచిగనుకున్న. గిట్ల సర్కారే కంటి పరీక్షలుజేసి అద్దాలు సుక ఇత్తున్నరని మా ఇంట్ల..ఆదు బాదులోల్లు సుక జెప్పిండ్రు. ముసలోల్లకు పింఛని పైసలు 2 వందల కెళ్లి 2వేలు జేసినాయిన కేసీఆరు. గాయిన గిసుంటి కంటి పరీక్షలు జేపిత్తున్నడంటే బరాబర్ మంచిగనే ఉంటదని గాడికే వొయ్యి కండ్ల పరీక్షలు జేపిచ్చుకున్న. పాపం కండ్ల డాక్టర్లు, ఆశ పని జేసెటోల్లు, అంగన్వాడమ్మలు అందరు గలిసి దగ్గరుండి సిన్న పిల్లను జూస్కున్నట్లు అన్ని తీర్ల అడిగి పరీక్షల్జేసి అద్దాలిచ్చిండ్రు. మునుపు మాగురు గనవడ్తుండే..గిప్పుడు కంటికి ఎలుగచ్చింది.
–డీకొండ అమృతాబాయి, బాల్కొండ
ఇతని పేరు కౌడ పోచ య్య. కమ్మర్పల్లి మండల కేంద్రం. స్థానిక గ్రామ పంచాయతీ ట్రా క్టర్ నడిపుతుంటాడు. కొంత కాలంగా కంటి చూపులో కొంత సమస్యను అనుభవించాడు. అసలే ట్రాక్టర్ నడిపే డ్యూటీ. సమస్య మరీ ఇబ్బందిగా మారకముందే కంటి డాక్టర్ను కలవాలనుకున్నాడు. ప్రైవేటులో ఖరీదైన పరీక్షలు, ఫీజుల గురించి ఆలోచించి కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగినప్పుడు వెళ్దామనుకొని గడుపుతూ వచ్చాడు. ఇంతలోనే మొద టి విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కావడం..కమ్మర్పల్లి గ్రామ పంచాయతిలో శిబిరం ఏర్పాటు చేయడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు తగు కంటి అద్దాలు ఇచ్చారు. సమస్య పరిష్కారమైంది.
కంటికి రెప్పలా జూస్కునుడంటే గిదే
కమ్మర్పల్లి, జనవరి 17 : కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఎంతో గొప్ప ఆలోచనతో కూడినది. ఎల్లీఎల్లక ఎందరో పేదలు, ముసలోల్లు కంటి పరీక్షలు జేసుకోక, కండ్లద్దాలు లేక కంటి చూపు సమస్య నానాటికీ ఎక్కువవుతూ బాధపడేటోళ్లు ఉన్నరు. గట్లాంటోళ్లకు సీఎం కేసీఆర్ అందించిన వరం ఇది. ప్రజలను కంటికి రెప్పలా సూస్కునుడు అంటే గిదే.
–కౌడ పోచయ్య, జి.పి. కార్మికుడు, కమ్మర్పల్లి మండల కేంద్రం