మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళలకు రుణాల పంపిణీ కీలకంగా మారింది. గ్రామాల్లో ఎన్నో మహిళా స్వయం సహాయక సంఘాలు, సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలతో వ్యాపారాలు ప్రారంభించుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రుణ పరిమితి సైతం గణనీయంగా పెంచడంతో వారికి మరింత ఆసరా అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ సంఘాలకు రుణాల పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతున్నది. రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మొత్తం 18,905 స్వయం సహాయక సంఘాలకు రూ.1032 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యాన్ని నిర్ధేశించారు.ఈ నెల 8 వ తేది నాటికే 11,031 స్వయం సహాయక సంఘాలకు రూ.769 కోట్ల 53 లక్షల రుణాలను పంపిణీ చేసి 74.51శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు.
కమ్మర్పల్లి, డిసెంబర్ 10 : జిల్లాలో మహిళా ఆర్థిక సాధికారత కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళా ఆర్థిక సాధికారత అందేలా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమాలు కీలకంగా మారి అందుకు తగ్గ ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల్లో ఎన్నో మహిళా స్వయం సహాయక సంఘాలు, సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆదాయ బాట పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారికి ఇచ్చే రుణ పరిమితి గణనీయంగా పెంచడం.. మహిళలు మంచి ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారాలు చేసుకోవడానికి, ఇది వరకే వారు నిర్వహించుకుటున్న వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవడానికి ఎంతో దోహదపడుతున్నది.ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ పెద్ద ఎత్తున, జోరుగా కొనసాగుతున్నది. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఈ సారి రుణాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతున్నది. రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడంతో జిల్లాకు భారీగా రుణ లక్ష్యం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మొత్తం 18,905 స్వయం సంఘాలకు రూ.1032 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించారు. క్రమంగా 2024 మార్చి వరకు ఈ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. ఐకేపీ అధికారులు, సిబ్బంది, బ్యాంకులు సమన్వయంతో లక్ష్యాన్ని చక చకా పూర్తి చేస్తూ మహిళల ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నెల 8 వ తేది నాటికే 11,031 స్వయం సహాయక సంఘాలకు రూ.769 కోట్ల 53 లక్షల రుణాల పంపిణీ చేసి 74.51 లక్ష్యాన్ని పూర్తి చేశారు.
జిల్లాలో మోస్రా మండలంలో 99.67 శాతం, నవీపేట్లో 92.38 శాతం, డిచ్పల్లిలో 85.96 శాతం, ఆర్మూర్లో 84.16 శాతం, రుద్రూర్లో 82.12 శాతం, నిజామాబాద్ రూరల్లో 81.94 శాతం, ఎడపల్లిలో 80.89, జక్రాన్పల్లిలో 80.73 శాతం, బాల్కొండలో 80.55 శాతం, ముప్కాల్లో 80.25 శాతం, చందూర్లో 80.16 శాతం, ఏర్గట్లలో 79.89 శాతం, కమ్మర్పల్లిలో 79.02 శాతం, నందిపేట్లో 78.05 శాతం, రెంజల్లో 77.01 శాతం, మెండోరాలో 75.89 శాతం, మాక్లూర్లో 74.02 శాతం, మోపాల్లో 70.77 శాతం, వేల్పూర్లో 70.17 శాతం, మోర్తాడ్లో 67.97 శాతం, కోటగిరిలో 67.86 శాతం, వర్నిలో 66.14 శాతం, ఇందల్వాయిలో 65.19 శాతం, బోధన్లో 64.88 శాతం, ధర్పల్లిలో 63.68 శాతం, భీమ్గల్లో 63.49 శాతం, సిరికొండ మండలంలో 59.72 శాతం లక్ష్యం పూర్తయ్యింది.
మహిళా ఆర్థిక సాధికారతకు రుణాలు ఎంతో దోహద పడుతున్నాయి. స్వయం సహాయక సంఘాలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రుణాలు ఎంతో కీలకం. దీంతో రుణాల పంపిణీ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వస్తున్నాం. అవసరమై సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ సలహాలు, సూచనలతో బ్యాంకు లింకేజీ రుణాలు సంఘాలకు త్వరగా అందేలా కృషి చేస్తున్నాం.