బాన్సువాడ, ఆగస్టు 12: బీసీ బంధుతో ఆర్థికంగా బలోపేతం కావాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికే ఈ పథకమని తెలిపారు. బలహీన వర్గాలకు వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్లో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 155 మంది బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..బీసీ బంధు ఒక గొప్ప పథకమని పేర్కొన్నారు.
ఇలాంటి పథకం దేశంలోనే లేదని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఎవరైనా లబ్ధిదారులు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే 20 శాతం సబ్సిడీ మంజూరు కావడానికి చెప్పలరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. పైరవీలకే సగం డబ్బులు ఖర్చయ్యేవని తెలిపారు. మిగతా 80 శాతం వాటా కోసం బ్యాంకుల చుట్టూ ఏండ్లతరబడి తిరగాల్సిన దుస్థితి ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.చెక్కు తీసుకొని వెళ్లి బ్యాంకు నుంచి నగదు తీసుకొని కులవృత్తి వ్యాపారం చేసుకోవచ్చని సూచించారు. బాన్సువాడ, రూరల్, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలో రెండువేల మంది అర్హులు ఉన్నారని, వారికి విడుతల వారీగా అందజేస్తామని చెప్పారు. బీసీబంధు ఒక నిరంతర కార్యక్రమమని తెలిపారు. ఎవరూ నిరాశ చెందవద్దని, అర్హులందరికీ ఈ పథకం అందుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వృథాచేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల్లో ఎవరికీ రూపాయి చెల్లించేది లేదని స్పష్టం చేశారు. బాన్సువాడ ని యోజకవర్గ పరిధిలోని 320 మంది లబ్ధిదారులకు చెక్కులు అందుతాయన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.