మోర్తాడ్, ఏప్రిల్ 8: మహిళా సంఘాలకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఈసారి రుణాలు అందజేశారు. గ్రామీణాభివృద్ధి సాధించవచ్చనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మహిళా సంఘాలకు రూ.1,228 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. మార్చి నెల ముగిసేలోపు జిల్లాలో మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల మొత్తం లక్ష్యాన్ని దాటడం గమనార్హం. ఇప్పటివరకు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం సంఘాలకు మొత్తం రూ.1,255 కోట్ల రుణాలు అందజేశారు. రుణాల మంజూరులో జిల్లా ముందంజలో ఉండగా, రుణాల రికవరీలోనూ ముందు వరుసల ఉండడం విశేషం.
జిల్లాలో 19,969 మహిళా సంఘాలు
జిల్లాలో 19,969 మహిళా సంఘాలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు రూ.1,228కోట్ల 9లక్షల 67వేలు లక్ష్యంగా నిర్దేశించారు. అయితే మార్చి నెలముగిసే సరికి ఇప్పటి వరకు జిల్లాలో 15,929 సంఘాలకు గాను రూ.1,254కోట్ల 98లక్షల 34వేలు రుణాలు మంజూరు చేశారు. గతేడాది ఇచ్చిన రుణాల రికవరీలోనూ లక్ష్యానికి చేరువలో జిల్లా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రుణాల రికవరీ కోసం ప్రత్యేక బృందాలను పంపించి మహిళా సంఘాలకు అవగాహన కల్పించి రుణాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
రుణాల మంజూరులో ఏర్గట్ల టాప్
మహిళా సంఘాలకు రుణాల మంజూరు విషయంలో ఏర్గట్ల మండలం జిల్లాలోనే టాప్లో నిలిచింది. ఈ మండలానికి రూ.19కోట్ల 79లక్షల 20వేల టార్గెట్ కాగా మార్చి నెలాఖరు వరకు రూ.22కోట్ల 40లక్షల 96వేల రుణాలను మంజూరు చేశారు. దీంతో జిల్లాలో 113.23 శాతంతో జిల్లాలోనే ముందువరుసలో నిలిచింది. ఎడపల్లి 112,51 శాతంతో రెండోస్థానం, మెండోరా 112.43శాతంతో మూడోస్థానం, వర్ని 109.10శాతంతో నాలుగో స్థానం, ఆర్మూర్ 108.99శాతం లక్ష్యాన్ని చేరుకుని ఐదోస్థానంలో నిలిచింది. మాక్లూర్, నందిపేట్, జక్రాన్పల్లి, మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, మోస్రా, ధర్పల్లి, నవీపేట్, ముప్కాల్, వేల్పూర్, సిరికొండ, మోపాల్ మండలాలు రుణాల మంజూరులో వందశాతాన్ని చేరుకున్నాయి. మిగిలిన మండలాలు కూడా లక్ష్యానికి చేరువకు చేరుకున్నాయి.