వినాయక్నగర్, ఫిబ్రవరి 5: నగరంలోని త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకుకారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గౌతం నగర్ కు చెందిన పవన్(20) ఆదివారం రాత్రి తన స్నేహితులైన చందు, చిన్ను యాదవ్ వద్దకు వెళ్లగా.. మద్యం తాగించాలన్న విషయంపై ముగ్గురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పవన్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఘర్షణ విషయం తెలుసుకున్న చిన్నుయాదవ్తోపాటు అతని తల్లి రేణుక, చందు కలిసి పవన్ ఇంటికి వెళ్లి అతడిని కత్తితో పొడిచింది.
తీవ్రగాయాలైన పవన్ను స్థానికులు వెంటనే జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతు డి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు రేణుక, చిన్ను యాదవ్, చందుల పై కేసు నమోదు చేసి,అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నగర సీఐ నరహరి తెలిపారు. పవన్ అంత్యక్రియలు నిర్వహించే ఆర్థిక పరిస్థితి వారి కుటుంబానికి లేకపోవడంతో త్రీ టౌన్ ఎస్సై ప్రవీణ్ సూచన మేరకు ఇందూ రు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.