ధర్పల్లి, జూన్ 27 : ధర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) దశ మారింది. ఈ సీహెచ్సీని వంద పడకల దవాఖానగా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కారు.. నాణ్యమైన వైద్యాన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తున్నది. అందులో భాగంగానే ధర్పల్లి సీహెచ్సీని అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ధర్పల్లిలో ప్రస్తుతం 30 పడకలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొనసాగుతున్నది. అయితే, వెనుకబడిన ఈ ప్రాంతంలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పించాలని, దవాఖానను విస్తరించాలని స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ భావించారు. వంద పడకల దవాఖాన తీసుకొస్తానని ఆయన మాట ఇచ్చారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి ధర్పల్లి వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
రూ.33.15 కోట్లు విడుదల..
ధర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దవాఖాన అభివృద్ధి, వైద్య పరికరాలు, అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.33.15 కోట్లను విడుదల చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వైద్యవిదానపరిషత్ (టీవీవీపీ) నేతృత్వంలో దవాఖాన అప్గ్రేడేషన్కు కావాల్సిన వసతులు, పనులకు ఈ నిధులు ఉపయోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న 100 పడకల దవాఖాన మంజూరు కావడంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎమ్మెల్యే బాజిరెడ్డి
ధర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల నుంచి 100 పడకల దవాఖానగా మారుస్తామన్న మాటను నిలబెట్టుకున్నానని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. ఇక్కడి పరిస్థితులు, వైద్య సేవల ప్రాముఖ్యత, అప్గ్రేడేషన్ ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సహకారంతో అప్గ్రేడేషన్ ఉత్తర్వులు వెలువడ్డాయని, ఇందుకోసం రూ.33.15 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అడగ్గానే వంద పడకల దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఆదర్శవంతమైన అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు.