కాంగ్రెస్ పాలనలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్నా, పట్టా పేరు మార్చాలన్నా పెద్ద ప్రహసనమే జరిగేది. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. డబ్బులు ఇస్తేనే ఏ పనైనా పూర్తయ్యేది. అధికారులు, దళారులు కలిసి రైతులను దోచుకునే వారు. కానీ, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ‘ధరణి’తో ఆనాటి దారుణాలకు అడ్డుకట్ట పడింది. ఎక్కడా రూపాయి ఇవ్వకుండా నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తవుతున్నాయి. సకాలంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 31
బాన్సువాడ రూరల్, మే 31 : ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు పకడ్బందీ విధానాన్ని రూపొందిస్తూ రైతుల సమగ్ర సమాచారాన్ని సైతం ఇందులో పొందుపర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు పక్కాగా యాజమాన్యపు హక్కులు కలిగి ఉండేలా తీసుకొచ్చిన గొప్ప పథకం ధరణి పోర్టల్. గత ప్రభుత్వాల హయాంలో భూమి రిజిస్ట్రేషన్ అంటే తలకు మించిన భారంగా ఉండేది. సాగు పనులను వదులుకొని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం రోజుల తరబడి సమయం పట్టేది. పైగా లంచాలు ముట్టజెప్పనిదే పని అయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తేవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరమైంది. పైరవీలు.. కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలకు చెక్ పడింది. గందరగోళంగా ఉన్న భూ రికార్డులన్నీ పాదర్శకంగా మారాయి. మీ సేవలో స్లాట్ బుకింగ్ పూర్తికాగానే నిర్దేశించిన సమయానికి తహసీల్ కార్యాలయాలకు వెళ్లగానే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మొత్తం పూర్తవుతున్నది. అంతా ఆన్లైన్ కావడంతో ఎక్కడా ఏ ఒక్కరికీ రూపాయి లంచం ఇవ్వకుండా.. పైరవీల్లేకుండా పని పూర్తవుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యి పట్టా పాసు పుస్తకాలలో పేర్లు బదలాయింపు పూర్తవుతుండడంతో ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు సైతం సాఫీగా అందుతున్నాయి. ధరణి పోర్టల్తో భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు సులువుగా అవుతుండ డంతో అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తొలగిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడంపై ప్రజలు మండి పడుతున్నారు. ధరణి మాకు ధైర్యం, భరోసా అంటూ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్పై మరోసారి మాట్లాడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి..
ఇంతకు ముందు పొలం రిజిస్ట్రేషన్కు ఎన్ని రోజులు పడుతుండెనో తెల్వకపోతుండె. గిప్పుడైతే సీఎం కేసీఆర్ సారు పుణ్యమా అని 15 నిమిషాల్లో పట్టా అవుతున్నది. నేను కొల్లూర్ శివారులో పొలం కొన్నా. ఒక్క రోజు ముందు స్లాట్ బుక్ చేసిన. తెల్లారే రిజిస్ట్రేషన్ అయ్యింది. ధరణి అచ్చినంక పైరవీలు, లంచాలు లేకుండా పోయినయ్. అప్పట్ల చెప్పులరిగేలా తిరిగేటోళ్లం. పైసల్ ఇచ్చినా పని కాకుండె. ధరణితోటి పనులు జల్ది అయితున్నాయ్. మస్తు సంతోషమనిపిస్తుంది.
– లక్ష్మణ్, రైతు, సుంకిని,
పొతంగల్ మండలం
భూముల లొల్లి అట్లనే ఉండల్నా..?
కోటగిరి : గతంలో గ్రామాల్లో గందరగోళంగా ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణితో అవన్నీ పరిష్కారం అవుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ భూములు కలిగి ఎంతో కాలం కలిసి ఉన్న రైతుల మధ్య గందరగోళంగా ఉన్న భూ రికార్డులతో పలుమార్లు గొడవలు, పంచాయితీలు అయినయ్. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్తో గ్రామాల్లో క్రమంగా భూసమస్యలు పరిష్కారం కావడంతో పాటు గెట్టు రైతుల వివాదాలు తగ్గుతున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా పారదర్శకంగా పట్టాపాసు పుస్తకాలు ఇస్తున్నారు. అన్నీ సాఫీగా జరగడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు అందుతున్నాయి. ఇలా అన్నీ మంచిగా నడవడం బాగాలేనట్టుంది కాంగ్రెసోళ్లకు. మళ్లీ ఎప్పటిలాగనే భూముల కోసం లొల్లులు, పంచాయతీలు కావాల్నా ఏంది. ఇలా మాట్లాడడం మంచిది కాదు..
– భాస్కర్, రైతు, సుంకిని, కోటగిరి
పైరవీకారులు అడ్రస్ లేకుండా పోయిండ్రు
సీఎం కేసీఆర్ సార్ తెచ్చిన ధరణితోటి రైతులకు ధైర్నం అచ్చింది. తెలంగాణ అచ్చినంక మా అసుంటి పేద రైతుల భూసమస్యలు పరిష్కారమైనయ్. అంతకుముందు రెవెన్యూ అధికారుల సుట్టూ తిరిగేటోళ్లం. గిప్పుడు ఆ సమస్య ముచ్చటే లేదు.. పట్టాపాస్ పుస్తకం కోసం పోతే అధికారులు శాన తిప్పుకునేటోళ్లు.. గిప్పుడు ధరణితోటి ఒక్క రోజులనే రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. నిన్ననే భూమిని రిజిస్ట్రేషన్ జేయించినా. మస్తు అలుకగ పనైంది. ఒక రోజు ముందుగలా స్లాట్ బుక్ చేయించుకున్న. ఎవరికి ఒక్క పైసా ఇయ్యలే. రిజిస్ట్రేషన్ కాంగనే పట్టా అచ్చింది. పైరవీకారులు పత్తాలేకుంటపోయిండ్రు. ధరణి ఇలాగే కొనసాగాలి. ఒకవేళ ధరణి రద్దు చేస్తే మళ్లీ అంతా ఆగమైతది.
-ఈ. శంకర్,రైతు, సుంకిని, కోటగిరి
ధరణి చాలా బాగుంది..
కామారెడ్డి : రైతులు సులభంగా భూముల క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు ధరణి చాలా ఉపయోగపడుతున్నది. ఎవరి పొలం వాళ్లకే ఉంటున్నది. గతంలో ఎవరి పొలం ఎక్కడ ఉందో అర్థమయ్యేది కాదు. అనేక చిక్కులు ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ సులువు కావడమే కాకుండా మా భూమి ఎక్కడ ఉందో తెలిసిపోయింది.
-గోవింద్, రైతు, క్యాసంపల్లి తండా, కామారెడ్డి
దళారులు లేకుండా రిజిస్ట్రేషన్లు అయినయ్..
దళారులు లేకుండా మాకు వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాం.అతి తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. గతంలో తహసీల్ కార్యాలయానికి వస్తే చాలా మంది దళారులు ఉండే వారు. వారికి లంచాలు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ చేసేవారు కాదు. లంచాలు ఇచ్చినా కూడా రిజిస్ట్రేషన్ తొందరగా అయ్యేది కాదు. చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లం. ఇప్పుడు ఆన్లైన్లో తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ అయ్యింది.
-రాజమల్లు, రైతు, రామేశ్వరపల్లి, కామారెడ్డి
పావు గంటలో చేతికి పట్టా పాసుపుస్తకం
బాన్సువాడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా ఈ – పట్టాదారు పాసు పుస్తకం పావుగంటలోనే చేతికి వచ్చింది. గతంలో భూమి కొని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోగా ఒక రోజులోనే పట్టా చేతికి రావడం సంతోషంగా ఉంది. ధరణి పోర్టల్ ఎంతో పారదర్శకంగా ఉంది. పట్టాదారు పాసుపుస్తకాల జారీ సులువుగా అవుతున్నది. ధరణి పోర్టల్ చరిత్రాత్మకమైనది.
– సుప్పని బస్వరాజ్, బోర్లం, బాన్సువాడ
ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయినయ్
గతంలో పొలం అమ్మలన్నా.. కొనాలన్నా ఆఫీసుల చుట్టూ, సార్ల చుట్టూ తిరిగినా పనులు కాకుండె. కేసీఆర్ సర్కారు తెచ్చిన ధరణితో భూముల రిజిస్ట్రేషన్ ఎంబడే అయితున్నది. మొన్ననే భూమి కొన్నా. కంప్యూటర్లో స్లాట్ బుక్ చేసిండ్రు. తెల్లారే రిజిస్ట్రేషన్ అయి పట్టా చేతికచ్చింది. ఎంత మంచి సౌలత్ జేసిండ్రు.
-మణెవ్వ, బూర్గు, బాన్సువాడ