ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆధ్యాత్మిక క్షేత్రాలన్నింటిలో సందడి వాతావరణం నెలకొన్నది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాది మొత్తం ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నిజామాబాద్లోని నీలకంఠేశ్వరాలయం, మాధవనగర్ సాయిబాబా ఆలయం, ఆర్మూర్ సిద్ధుల గుట్ట, బీర్కూర్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయం, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం తదితర ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. బారులుతీరి దైవదర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు