డిచ్పల్లి, అక్టోబర్ 5 : అభివృద్ధి చేసేది ఎవరో.. మాయమాటలు చెప్పేది ఎవరో ప్రజలు గమనించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో రూ.6.65 కోట్ల అభివృద్ధి పనులను, గ్రామంలో ఏర్పాటు చేసిన జయశంకర్సార్ కాంస్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. గ్రామంలో 32 మందికి మంజూరైన గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. యువకులకు క్రీడా కిట్లను, మహిళలకు బతుకమ్మ చీరలనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు వారికీ న్యాయం జరుగుతున్నదన్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో చెరువులు, కుంటలను మరమ్మతు చేసుకున్నామని.. కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న దానికి నిదర్శనం ఈ సంక్షేమ కార్యక్రమాలేనన్నారు. తెలంగాణ వ్యతిరేకి మోదీ అని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎందుకు లేవన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఇటీవల జిల్లాకు వచ్చిన మోదీ తన హోదాను మరిచి సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకున్పానరని అన్నారు. కేటీఆర్ను సీఎం చేయలంటే మోదీ సహకారం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అప్రమత్తగా ఉండాలని, అభివృద్ధి చేసే వారెవరో మాటలు చెప్పే వారెవరో ప్రజలు గమనించాలన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు గ్రామప్రజలు మహిళలు పాల్గొన్నారు.