విద్యానగర్ /ఖలీల్వాడి, డిసెంబర్ 8 : ‘మన ఊరు.. మన బడి’లో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన తదితరులు పాఠశాలల అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతగా మండలానికి రెండు చొప్పున 44 పాఠశాలలు మోడల్గా చేపట్టేందు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆరు పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. నిర్దేశించిన పనులు ఈ నెల చివరి వారంలోగా పూర్తి చేస్తామన్నారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 114 పాఠశాలల్లోనూ గడువులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు.
సివిల్ పనులు పూర్తయిన బడుల్లో ఎనిమిది బృందాలతో పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. లైబర్రీల ఏర్పాటు కోసం అవసరమైన గదులను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచామన్నారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రతి పాఠశాలను తనిఖీ చేయాలన్నారు. నిధులకు కొరత లేదని పాఠశాలలను అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఉండి తీరాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పనులు పూర్తయిన వాటి బిల్లులు మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కామారెడ్డిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, కో-ఆర్డినేటర్ శ్రీపతి, గంగాకిషన్, మండల నోడల్ ఆఫీసరులు తదితరులు పాల్గొన్నారు.నిజామాబాద్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి నర్రా రామారావు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు భావన్న, దేవీదాస్, రమేశ్ పాల్గొన్నారు.