అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నా కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కాంటాలు, బస్తాల తరలింపు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మరీ కాంటాలు పెట్టించడంతో వడ్ల సేకరణ పూర్తి కావొచ్చింది. మరోవైపు, ధాన్యం సేకరణకు ఎక్కడా ఆటంకం కలుగకుండా కామారెడ్డి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.
బాన్సువాడ, మే 9 : కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరిస్తూ రైస్మిల్లులకు తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు. అవసరాలకు అనుగుణంగా 330 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 14,690 మంది రైతుల నుంచి 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో పాటు రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ కావడంతో జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉందని సివిల్ సప్లయి అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో యాసంగిలో 2.59 లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. సుమారు 5 లక్షల క్వింటాళ్ల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. 330 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించారు. సొసైటీల ఆధ్వర్యంలో 325 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 310 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కు గాను 20 కేంద్రాల ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 14,690 మంది రైతుల నుంచి 96వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన 24,558 మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
బాన్సువాడ నియోజక వర్గంలో ఇప్పటి వరకు సుమారు 40 వేల మెట్రిక్ టన్నులు, జుక్కల్ నియోజక వర్గంలో 15,493, ఎల్లారెడ్డిలో 29,735, కామారెడ్డి నియోజక వర్గంలో 14, 341 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజక వర్గం ధాన్యం కొనుగోళ్లలో నంబర్ వన్గా నిలిచింది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు వడగండ్ల వానలతో ధాన్యం తడిసిన రైతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి బాసటగా నిలిచారు. గ్రామాల్లో పర్యటిస్తూ తక్షణమే కాంటాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజక వర్గంలో 80 శాతం కొనుగోళ్లు చేపట్టడంతో జిల్లాలోనే అత్యధికంగా ధాన్యం సేకరించిన నియోజక వర్గంగా బాన్సువాడ నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నది. సాగుకు అన్ని వసతులు కల్పిస్తూనే గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంట దిగుబడులను సేకరిస్తున్నది. విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ముఖ్యంగా స్పీకర్ పోచారం శీనన్న ఉండడం మా అదృష్టం. వర్షాలు ఒకవైపు ఆగమాగం జేసినయ్. రాత్రికి రాత్రి మిర్జాపూర్కు వచ్చి అధికారులను వెంట తెచ్చి వడ్ల కాంటాలు పెట్టిచ్చిండు. ఈ సారి అకాల వర్షాలతో మస్తు ఇబ్బందులు పడ్డం. కానీ స్పీకర్ సార్ పుణ్యం తో గడ్డకెక్కినం. ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటాం.
-పురం సాయిలు, మిర్జాపూర్, నస్రుల్లాబాద్ మండలం
వడ్లు కాంటా చేసిన రెండు రోజుల్లో అకౌంట్ల పైసల్ పడ్డయి. చెడగొట్టు వానలు పడుతున్నా స్పీకర్ సార్ అన్ని గ్రామాలకు తిరిగి, కాంటాలు పెట్టించిండు. మస్తు మంది నాయకులు వడ్లు కొనాలే అని చెప్పినోళ్లే కానీ స్పీకర్ సార్ దగ్గరుండి వడ్ల కాంటాలు పెట్టించి పంపిండు. స్పీకర్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
-బాపురెడ్డి, కొల్లూర్, బాన్సువాడ.
కాంటాలు పెట్టిన వెంటనే డబ్బులు పడ్డయి. కొంత మంది కాంటాలు జరుగుతలేవని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా రైతుల దగ్గరికి వచ్చి ఇబ్బందులను చూసిన వారు ఉండరు. కానీ స్పీకర్ సార్ వర్షాలు పడుతున్నా తిరిగి కాంటాలు పెట్టించిండు. కొంత మంది పనిగట్టుకొని లేనిపోని మాటలు, లేని పోని వార్తలు రాస్తున్నరు. ఇది సరైంది కాదు.
-పాశం రవీందర్ రెడ్డి, బాన్సువాడ.