సమైక్య పాలనలో రుణాల పాలైన కర్షకులు
వడ్డీలు కట్టలేక సతమతమైన రైతులు
తెలంగాణ సిద్ధించాక మారిన బతుకులు
అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన కేసీఆర్
పెట్టుబడి సాయం’తో వడ్డీ వ్యాపారులకు కళ్లెం
రైతుబంధు’తో పరుగులు తీస్తున్న వ్యవసాయ రంగం
ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మంది రైతులకు చేయూత
నిజామాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఎంత మార్పు.. ఒక్క చారిత్రక పథకం లక్షలాది మంది తలరాతను మార్చేసింది. అప్పుల చట్రంలో చిక్కుకుని అల్లాడిన రైతులకు రుణ విముక్తి కల్పించింది. సమైక్య పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న సాగురంగాన్ని సంక్షేమ పథం వైపు నడిపించింది. అదే రైతుబంధు పథకం. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టుకొచ్చిన ఈ పథకం.. గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అప్పుల కుంపట్లలో చితికిపోయిన రైతాంగానికి జవసత్వాలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పెట్టుబడి సాయం’తో రైతుకు ఆర్థిక స్వాతంత్య్రం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ‘మద్దతు’ దొరకక, గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆర్థికంగా చితికి పోయారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి ఉసురు తీసుకున్నారు. మిగిలిన వారు కాడి వదిలేశారు. కానీ తెలంగాణ రాకతో సాగు రంగం మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు అందిస్తున్న ‘సాయం’తో రైతన్న ఆనందంగా అరక పట్టి పొలం వైపు కదులుతున్నాడు.
పంట పెట్టుబడి సాయం.. రైతుబంధు పథకంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఐదున్నర లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.10వేలు అందుతుండడంతో రైతులకు రుణ గోస సమసిపోయింది. అనేక ఇక్కట్లతో సతమతమైన అన్నదాతలకు సరికొత్త ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధించింది. దీంతో స్వేచ్ఛగా పంటలు సాగు చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సాయం.. సమయానికి రైతుకు చేరుతున్నది. ఉద్దెర ఇచ్చేవారున్నప్పటికీ తీసుకునే రైతులే కనిపించకపోవడంతో వ్యాపారులూ విస్తూపోతున్నారు. ఏటా వానకాలం, యాసంగి సీజన్ వచ్చిందంటే చాలు టక్కున వడ్డీ వ్యాపారుల ఇండ్లల్లో రైతన్నలు దర్శనం ఇచ్చేవారు. కర్షకుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ పబ్బం గడిపే వడ్డీవ్యాపారులకు పెట్టుబడి సాయంతో చెక్ పడింది. గతంలో పంటల సీజన్ ప్రారంభం కాగానే రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. చేతిలో పెట్టుబడి లేక డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన వారంతా చివరకు ఫెర్టిలైజర్ షాపుల్లోనూ ఉద్దెర పెట్టి విత్తనాలు, ఎరువులు తీసుకునేవారు. ఇదే అదనుగా వ్యాపారులు సైతం రైతులను నిలువునా దోచుకునేవారు. ఎక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలను అప్పగించడంతోపాటు వడ్డీ పేరిట అదనంగా వసూలు చేసేవారు. రైతుబంధు సాయంతో ఇలాంటి దుస్థితి నామ రూపాల్లేకుండా పోయింది.
నేడు రైతుబంధు జాతర..
పెట్టుబడి సాయం ప్రారంభమైన నాటి నుంచి పల్లెల్లో సాగు జాతర నడుస్తున్నది. యాసంగి పంటల సీజన్ ప్రారంభం కావడంతో చేతికి వచ్చిన పెట్టుబడి డబ్బులతో అన్నదాతలు మురిసిపోతున్నారు. డబ్బును దుబారా చేయకుండా ప్రభుత్వ సాయాన్ని పెట్టుబడులకే సర్దుకుంటున్నారు. రైతుబంధు పథకంతో ఆర్థిక ఇబ్బందులు తీరాయని చిన్న, సన్నకారు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయం దగ్గర పడుతుంటే గతంలో ఆందోళన ఉండేదని, ఇప్పుడు సమయానికి ముందే చేతికి డబ్బు రావడంతో భరోసా కలుగుతున్నదని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న రైతుబంధుతో రైతు ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి ఎక్కువ మందే ఉన్నారు. వీరంతా పెట్టుబడికి డబ్బుల బాధ లేకపోవడంతో బీడు భూములను ధైర్యంగా సాగు చేసుకుంటున్నారు. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతున్నది.
నాడు వడ్డీ బాధలు వర్ణనాతీతం
రైతుబంధు పథకం ప్రారంభానికి ముందు వరకు వడ్డీ వ్యాపారుల ముంగిట అన్నదాతలంతా సాగిలాపడాల్సిన దుస్థితి ఉండేది. గ్రామాల్లో డబ్బున్న వ్యక్తుల నుంచి పైసలను తీసుకుని పెట్టుబడి కోసం వెచ్చించేవారు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలను విక్రయించాక అప్పులు తీర్చేవారు. ఆరు నెలల కాలానికి బారు వడ్డీ, చక్రవడ్డీని లెక్కించి వ్యాపారులు వసూలు చేసేవారు. శ్రమకోర్చి సంపాదించినదంతా వడ్డీ వ్యాపారులకే సగం ముట్టజెప్పాల్సి వచ్చేది. లేదంటే మరో సీజన్కు డబ్బులు దొరకవనే భయంతో అడిగినంతా చెల్లించేవారు. ఇలా సాగిన ఇక్కట్ల పరంపరకు సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన రైతుబంధు పథకంతో తెరపడింది. రైతులెవ్వరూ ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించే విధంగా పెట్టుబడి సాయం పథకం ఉపయోగపడుతున్నది. ఎకరానికి ప్రస్తుతం రూ.5 వేల చొప్పున ఏటా రెండు సీజన్లు కలిపి రూ.10 వేలు అందుతున్నాయి. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతుండడంతో నిధులు పక్కదారి పడుతాయనే సమస్యే లేదు. నగదు సాయాన్ని ఎరువులు, విత్తనాలు, ఇతరత్రా సాగు పనులకు వెచ్చిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన రైతుల సంఖ్య..
2018, మే 10న మొదలైన రైతుబంధు పథకం ఇప్పుడు పదో విడుతకు చేరింది. నిజామాబాద్ జిల్లాలో పథకం ప్రారంభమైన సమయంలో 2.39లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య పదో విడుత వచ్చేసరికి 2లక్షల 54వేలకు చేరింది. మొదటి విడుత కామారెడ్డి జిల్లాలో 2లక్షల 42వేల మంది ఉన్న రైతులు.. ఇప్పుడు 2 లక్షల 71వేల మందికి చేడరం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వానకాలం లెక్కల ప్రకారం సుమారు ఐదున్నర లక్షల మందికి రైతుబంధు పథకం ద్వారా ఏకంగా రూ.520 కోట్లు పంపిణీ చేశారు. ఈ యాసంగిలోనూ ఇంచుమించు ఇంతే మొత్తంలో రైతుబంధు అందనుంది. వ్యవసాయ రంగం ఇప్పుడు సంక్షోభం నుంచి బయట పడడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. కొన్నేళ్లుగా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో కర్షకులకు రుణవిముక్తి కలిగికంది. రూ.2 నుంచి రూ.4 చొప్పున వడ్డీ తీసుకొని రుణ బంధీలుగా మారి సతమతమైన వారంతా.. రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం పొంది ఆనందంలో ఉన్నారు.
2,28,565 మంది రైతులకు లబ్ధి
విద్యానగర్, జనవరి 2 : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం వరకు 2,28,565 మంది రైతులకు రైతుబంధు పథకం అందినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి బ్యాంకు అకౌంట్లలో మొతం 136 కోట్ల 8లక్షల 99వేల 605 రూపాయలు జమయ్యాయని వెల్లడించారు. మిగతా వారికికూడా త్వరలో డబ్బులు జమవుతాయని, రైతులకు ఫోన్ ద్వారా మెస్సేజ్ వస్తుందని తెలిపారు.