ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. వారం రోజులుగా భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండల కేంద్రంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికి మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 9గంటలు దాటిందంటే బయటికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు. కూలీలు, చిరువ్యాపారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. అనవసరంగా బయటికి రావొద్దని.. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని 12 మండలాలను ఆరెంజ్ జోన్గా ప్రకటించారు.
-ఖలీల్వాడి/కామారెడ్డి, మే 14(నమస్తే తెలంగాణ)
కామారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో మొన్నటివరకు చల్లబడిన వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంటున్నది. రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండ తాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా, మధ్యాహ్నం 12 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో ఆదివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. డోంగ్లీ మండల కేంద్రంలో అత్యధికంగా 44.5 డిగ్రీలు, కనిష్ఠంగా తాడ్వాయిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీర్కూర్ మండల కేంద్రంలో 42.3 డిగ్రీలు, బాన్సువాడ మండలం కొల్లూర్, బిచ్కుంద మండలం పుల్కల్లో 42, భిక్కనూరు మండలంలో 41.9, గాంధారి మండలం సర్వాపూర్లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని 12 మండలాలు ఆరేంజ్ జోన్లోకి వెళ్లాయి. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాల్లో సగటున 38 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఎండ వేడిమి, ఉక్కపోతను తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు శీతల పానీయాలను సేవిస్తున్నారు. కూల్డ్రింక్ షాపులు, జ్యూస్ స్టాళ్ల వద్ద సందడి పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా గాలిలో తేమశాతం పెరగడంతో ఉక్కపోతతో జనం ఆల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వేడిని తట్టుకోలేక రాత్రంతా సరిగా నిద్రపోవడంలేదు.
వాతావరణంలో మార్పులు..
వారం క్రితం అకాల వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడగా, ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఒకేసారి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్న రైతులు.. ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్లకింద సేదతీరుతున్నారు. భవన నిర్మాణాల పనులు వేగవంతం కావడంతో కూలీలపై ఎండ ప్రభావం పెరుగుతున్నది. దినసరి కూలీలు, చిరు వ్యాపారులు మధ్యాహ్నం వేళ తమ పనులను వదిలి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఎండల ప్రభావం కూరగాయలు, తోటలపై కూడా పడుతున్నది. పశువులు సేద తీరేందుకు పొద్దంతా చెరువులు, కుంటల్లోనే ఉంటున్నాయి. వాతావరణ మార్పులతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరడంతో వేడిమిని భరించలేకపోతున్నారు.
ఉక్కపోతతో.. ఉక్కిరిబిక్కిరి
కామారెడ్డి/ఖలీల్వాడి/కోటగిరి/ఆర్మూర్, మే 14: ఉభయ జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో జనాలు బయట మాత్రమే కాదు, ఇంట్లో కూడా వేడిమితో అల్లాడుతున్నారు. చెమట, ఉక్కపోత కారణంగా ఏమాత్రం అనుకూలంగా ఉండడంలేదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరం వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేం, బయటికి వెళ్లలేకపోతున్నాం. వారం క్రితం వరకు భారీ వర్షాలు కురిసి.. ఇప్పుడు ఎండలు దంచి కొట్టడంతో ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానకు ప్రతిరోజూ తలనొప్పి, విరేచనాల సమస్యలతో 10 నుంచి 15 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు.. చికిత్స..
మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. అంతకు మించి ఉంటే అస్వస్థతకు గురవుతాడు. మండుటెండల్లో రెండు గంటలకుపైగా తిరిగితే శరీరం నీటి శాతం కోల్పోతుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటే వడదెబ్బ బారిన పడుతారని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండల్లో ఎక్కువసేపు తిరగకూడదు. అత్యవసరమైనే తలపై టోపీ, రుమాలు, కాటన్ దుస్తులతో వెళ్లాలి. నల్లటి దుస్తులతో మరింత వేడిగా ఉంటుంది.
ఆరెంజ్ అలర్ట్
బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడదెబ్బ తగలడానికి కారణాలు
ఎండదెబ్బ నుంచి రక్షణ ఇలా..
వేసవిలో ముఖ్యంగా శరీరంలో ప్లూయిడ్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవల్స్ తగ్గితే శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది. ఎక్కువ మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. గంటకు 2,3 గ్లాసుల నీరు తీసుకోవాలి. పుచ్చకాయ రసం, బార్లీ జావలో పటికబెల్లం, కొబ్బరి నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం, తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నిజామాబాద్ జిల్లాలో వారంరోజుల ఉష్ణోగ్రతల వివరాలు
నీడపట్టునే ఉండండి..
వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. వడగాలుల ప్రభావం కూడా ఉన్నది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చేసుకోండి. ఇంట్లో, నీడపట్టున ఉండడం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లొద్దు. అత్యవసరమైనే ఎండల నుంచి రక్షణగా జాగ్రత్తలు పాటించండి. తేలికపాటి ఆహారం, లిక్విడ్స్ తీసుకోవాలి .
-సుదర్శనం డీఎంహెచ్వో, నిజామాబాద్
బయట కాలుపెట్టేటట్లు లేదు..
వారం రోజులుగా ఎండలు బాగా పెరిగినయ్. బయట కాలుకూడా పెట్టే పరిస్థితి లేదు. మధ్యాహ్నం పూట ఎండ భగ్గుమంటున్నది. అందుకే పొద్దునపూటనే అన్ని పనులు చేసుకొంటున్నాం. ఎండలో తిరిగి వడదెబ్బ బారిన పడడం కన్నా ఇంటో ఉండడమే మేలు. రోజువారీ పనులు చేసుకోవడంలో కొంత ఇబ్బంది అవుతున్నది.
-కాకర్ల రమేశ్, వికాస్నగర్, కామారెడ్డి
వేడిమి పెరుగుతున్నది..
ఎండ వేడిమి రొజురోజుకూ పెరుగుతున్నది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. మధ్యా హ్నం పూట మరింత ఎండ ఉంటున్నది. ఉక్కపోత భరించలేకపోతున్నాం. ఎండను చూసి నేను బయటికి వెళ్లడం లేదు. మొక్కలు కూడా వాడిపోతున్నాయి. అవి ఎండిపోకుండా రెండు పూటలా నీరు పోస్తున్నాం.
-ముదాం నారాయణ, ఆర్బీ నగర్, కామారెడ్డి
వడదెబ్బతో జాగ్రత్త..
ఎండ వేడిమికి టైఫాయిడ్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, తలనొప్పి, వాం తులు, విరేచనాలు వస్తాయి. మధ్యా హ్నం సమయంలో బయటికి వెళ్లే ప్రయత్నాలు విరమించుకోవాలి. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పనులన్నీ ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే చేసుకోవాలి. నీరసం, నరాల బలహీనత, తలనొప్పి అనిపిస్తే వెంటనే చిటికెడు ఉప్పు, చక్కెరకలిపిన నీటిని తాగాలి. ఆ తర్వాత వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. ఎండలో తిరిగినప్పుడు వెంటనే నీరు తాగొద్దు. పిల్లలు, వృద్ధులు ఇంటినుంచి బయటికి రావొద్దు. రోజూ కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.
-డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్, ఇన్చార్జి డీసీహెచ్, కామారెడ్డి
అనారోగ్యం బారినపడితే వెంటేనే వైద్యుడిని సంప్రదించాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నది. శరీరంలో మార్పులు వస్తే, ఏ చిన్న అనారోగ్యానికి గురైనా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. టీ, కాఫీలు, మసాలాలకు దూరంగా ఉండాలి. రోజూ పండ్లరసాలు, అంబలి, మజ్జిగ తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి
-డాక్టర్ నాగరాజు, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్, ఆర్మూర్