ఖలీల్వాడి, డిసెంబర్21: జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ వారం ఆరంభం వరకు సాధారణ స్థితిలో ఉన్న ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తున్నది. వారం క్రితం చలి తీవ్రత తగ్గినా నాలుగు రోజులు నుంచి మళ్లీ చలి పెరుగుతున్నది. జిల్లాలో గురువారం గరిష్ఠంగా 27.9, కనిష్ఠంగా 14.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల నుంచి ప్రజలు ఉదయం 8 గంటలు అయిన ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. సాయంత్రం 5 గంటల్లోపే ఇండ్లకు చేరుకుంటున్నారు. రెండు రోజులుగా 14.1 ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి మంటలు సాధారణమయ్యాయి.
బయటికి వెళ్లాలంటే చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనబడని స్థితిలో ఎనిమిది గంటల వరకు వాహనాలు డిప్పర్ల సహాయంతోనే రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు కురువడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి. ఈ సమయాల్లో ఆస్తమా, చర్మ సంబంధ, హృద్రోగ బాధితులు, చిన్న పిల్లలకు న్యూమోనియా వ్యాధుల భయం ఉన్నవారు జాగ్రత్తగా వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.