దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయం అందించి ఆర్థిక పరిపుష్టి సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 900 యూనిట్లు మంజూరు చేయగా.. కూలీలు, పనివారిగా ఉన్న వారు యజమానులుగా మారి స్వయం ఉపాధి పొందుతూ దర్జాగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ తాజాగా రెండో విడుతలో మరిన్ని యూనిట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేయనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 9,900 మందికి లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండో విడుతకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేసీఆర్ నిర్ణయంతో దళిత వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో మరెక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెండో విడుతలో భాగంగా మరిన్ని యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే సంతకం చేయడంతో త్వరలోనే పలువురికి క్షేత్రస్థాయిలో లాభం చేకూరనున్నది. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుండడం విశేషం. దళితబంధు పథకం ద్వారా అణగారిన వర్గాల్లో అత్యున్నత జీవన ప్రమాణాలను పెంపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఎంతో మంది మేథావులతో చర్చోపచర్చలు జరిపిన అనంతరం మూడేండ్ల క్రితం నుంచి అమల్లోకి వచ్చిన పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. తాజాగా రెండో విడుతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏకంగా 1,100 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9,900 యూనిట్లు మంజూరు కానున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేదే తుది నిర్ణయం. దీని ద్వారా వేలాది మంది దళిత కుటుంబాల్లో గణనీయమైన మార్పు రానున్నది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలపై అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.
పేద కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు..
పేద దళిత కుటుంబాల్లో ఆర్థిక వెలుగులను ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఆయా కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి పలు రంగాల్లో ముందడుగు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వెనుకబడిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో ఓ పథకాన్ని నేరుగా నగదు బదిలీ చేస్తున్న దాఖలాలు లేవు. పూర్తి స్థాయి రాయితీతో ఎలాంటి నిబంధనలు, లబ్ధిదారుడి వాటా లేకుండా అమలవుతున్న పథకంగా దళితబంధు చరిత్రకెక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి వంద యూనిట్లు చొప్పున నిజామాబాద్లో 550, కామారెడ్డిలో 350 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన గ్రౌండింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ జరిగింది. వీరంతా తమ కాళ్లపై తాము నిలబడి దళితబంధు ద్వారా ప్రగతిని సాధిస్తున్నారు. మొన్నటి వరకు కూలీలుగా, ఆయా చోట్ల నెలవారీ జీతాలకు పనులు చేసిన వారే ఇప్పుడు యజమానులుగా మారారు.
ఇచ్చిన మాట నెరవేరుస్తూ..
ఆరు నూరైన దళితబంధు పథకాన్ని అమలు చేసి చూపిస్తామని 2020 సంవత్సరం ముగింపులో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని హుజురాబాద్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. నియోజకవర్గానికి వంద యూనిట్ల పంపిణీ పూర్తి కావడంతో 2022-23 ఆర్థిక సంవత్సంలో మరింత మందికి ఈ పథకాన్ని వర్తింప జేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన జుక్కల్ నియోజకవర్గంలోని ఈ మండలంలో దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 1,320 మందికి దళితబంధు కింద ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రయోజనం పొందిన వారంతా తమ కాళ్లపై తాము నిలబడి దర్జాగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండో విడుతకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 1,100 యూనిట్లు మంజూరయ్యే వీలున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండడంతో 9,900 దళితబంధు యూనిట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వేలాది మందికి దళిత బంధు ప్రయోజనాలు దక్కనుండడంతో సంబంధిత వర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మంజూరు ఇలా..
దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన రూ.పది లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతాయి. కానీ వీటిని వ్యక్తిగత అవసరాలకు వెచ్చించరాదు. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి, గతేడాది మంజూరైన లబ్ధిదారులకు అమలు చేసింది. సొంత అవసరాల కోసం నిధులు మళ్లించడం ద్వారా ప్రభుత్వం భావిస్తున్న భారీ ప్రయోజనం ఆయా కుటుంబాలకు చేరదు. లబ్ధిదారుడు నేరుగా డ్రా చేసుకునేందుకు వీలులేకుండా నిబంధనలు పెట్టారు. దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు తన ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకునే యూనిట్కు సంబంధించిన పేమెంట్ సైతం నేరుగా చెల్లిస్తారు. సదరు వ్యాపార సంస్థకు నేరుగా లబ్ధిదారుని అకౌంట్ నుంచి పేమెంట్ జరుగుతుంది. ఒక యూనిట్లో రూ.10లక్షలకు అంత కన్నా తక్కువ వ్యయమైతే మిగిలిన డబ్బులను సైతం సొంతానికి వెచ్చించేందుకు వీలు లేదు. వాటిని యూనిట్ను దీర్ఘకాలికంగా ఎలాంటి నష్టాలు సంభవించకుండా లాభదాయకంగా నడిపించేందుకు వినియోగించాల్సి ఉంటుంది. పథకం ఉద్దేశం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. దీంతో లబ్ధిదారులు తమకు ఇష్టమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి పొందే వీలు వంద శాతం దక్కనున్నది.
రెండు లక్షలు సంపాదించా..
మాది నిజాంసాగర్ మండలంలోని మాగి. నాకు దళితబంధు మంజూరు కావడంతో గ్రామంలో టెంట్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నాం. మాగితోపాటు చుట్టుపక్కల మరో నాలుగు గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా టెంట్ హౌస్ను ఏర్పాటు చేయడంతో ఇప్పటివరకు పెండ్లిలు, ఫంక్షన్లకు సామగ్రి కిరాయి ఇస్తూ.. ఖర్చులు పోగా ఎనిమిది నెలల్లో సుమారు రెండు లక్షల వరకు సంపాదించా. టెంట్ హౌస్తో పాటు డీజే సౌండ్ సిస్టం కూడా ఉండడంతో గిరాకీ బాగుంటున్న ది. అంతకు ముం దు నేను పట్నంలో వాచ్మన్ పని చేసేవాడిని. అలాంటిది సీఎం కేసీఆర్ దయ తో దళితబంధు పథ కం రావడంతో నాతో పాటు మరో నలుగురు పిల్లలకు ఉపాధి కల్పిస్తూ గ్రామంలో తలెత్తుకొని బతుకుతున్నాం.
– ఎర్ర బాలయ్య, మాగి
డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యా..
నాకు దళితబంధు పథకం మంజూరు కావడంతో టాటా కంపెనీ గూడ్స్ వెహికల్ తీసుకున్నాను. మా ఊరి దగ్గర గాయత్రీ చక్కెర పరిశ్రమ ఉండడంతో దాంట్లో నెలకు పదిహేను రోజులు కిరాయికి వెళ్తున్నాను. దీనికి తోడు బయటి కిరాయిలకు వెళ్తున్నా ను. డీజిల్ ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.25వేల వరకు సంపాదిస్తున్నాను. మొన్నటి వరకు మా ఊర్లోనే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడిని. సీఎం పుణ్యమా అంటూ డ్రైవర్ నుంచి ఓనర్గా మారి సొంత వాహనాన్ని నడిపించుకుంటున్నాను. దళితబంధుతో మా గ్రామంలో సుమా రు 70 మంది కుటుంబాలకు పథ కం వర్తించడంతో ప్రతి ఒక్కరూ సం తోషంగా ఉంటున్నారు. నేను ఎనిమిది నెలల్లో సుమారు రెండు లక్షల రూపాయల వరకు సంపాదించాను.
– దుర్గయ్య, గోర్గల్