ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ వారి ఖాతాల నుంచి నగదును కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తరచూ ఇలాంటి సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకొని వ్యక్తిగత సమాచారం లాగుతున్నారు. అలాగే, బ్యాంకు అధికారులమని కాల్ చేసి వివరాలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లకు ఏవో లింకులు పంపిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా నేరాలు ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు పల్లెలకూ విస్తరించాయి. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది అధికారిక లెక్కల ప్రకారం 450 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
నిజామాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): .జిల్లాలో సైబర్ నేరాలు ఆగడంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోటు సైబర్ క్రైమ్ చోటుచేసుకుంటుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమాయక ప్రజలే లక్ష్యంగా నేరగాళ్లు వల విసిరి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫోన్ కాల్స్, మెస్సేజ్ల రూపంలో అమాయకులను బుట్టలో వేసుకొని దుండగులు డబ్బులు కాజేస్తున్నారు. మోసగాళ్లు రూట్ మార్చారు. యువత, ప్రజలు అత్యధికంగా అలవాటు పడిన సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆఫర్ల పేరిట లింకులు పంపుతూ క్లిక్ చేయాల్సిందిగా సూచనలు చేస్తున్నారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నమ్మశక్యం గాని ప్రకటనలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. వీరి వలలో చిక్కిన అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. చదువుకున్న వారూ ఆన్లైన్ మోసాలకు గురవుతుండగా ఇక నిరక్షరాస్యులను నిలువునా ముంచుతున్నారు. దుండగులకు ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) చెప్పేయడంతో అకౌంట్ను ట్రాప్ చేసేసి బ్యాలెన్స్ ఖతం చేసేస్తున్నారు. మోసపోయిన వారిలో కొందరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారు పరువు పోతుందనే భావనతో బయటికి రావడంలేదు. అధికారిక లెక్కల ప్రకారం 2022లో జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఏకంగా 450 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది.
అత్యధిక కేసులు…
2022లో అత్యధికంగా 450 కేసులు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యాయి. 2019లో 320 కేసులు, 2020లో 371 కేసులు, 2021లో 400 కేసులు నమోదు కాగా రికార్డు స్థాయిలో గతేడాది సైబర్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో నమోదైన కేసుల్లో సుమారుమూడున్నర కోట్ల మేర సొమ్ము అపహరణకు గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాలను మోసం చేసేందుకు దుండగులు కొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు.
ఊరు, పేరు లేని నంబర్లో ఫోన్లు చేసి వివరాలను ఆరా తీస్తున్నారు. మాటలతో ఆకట్టుకుంటూ తీరా వివరాలు చెప్పాక ఫోన్ కట్ చేయడం వంటివి మోసగాళ్లు చేస్తున్నారు. బాధితుడు తిరిగి ఫోన్ చేద్దామంటే అది కనీసం కలిసే పరిస్థితే ఉండదు. ఇలా బ్యాంకు సేవలపై కనీస పరిజ్ఞానం లేకపోవడంతో చాలా మంది మాయగాళ్ల ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వాస్తవానికి బ్యాంకు అధికారులు తమ ఖాతాదారుల వివరాలను ఫోన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించదు. నేరుగా బ్యాంకుకు వెళ్లినప్పుడు కూడా వ్యక్తి వివరాలను పరిశీలించిన తర్వాత వివరాలు చెబుతారు.
మచ్చుకు కొన్ని కేసులిలా…
మెండోరా మండలంలోని ఓ వ్యక్తికి స్నేహితుడి పేరు ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మెస్సేజ్ వచ్చింది. దవాఖానలో ఉన్నాను. డబ్బు కావాలని కోరాడు. దీంతో సదరు వ్యక్తి రూ.8200 ఫోన్ పే ద్వారా పంపాడు. తర్వాత తన స్నేహితుడికి కాల్ చేయగా తాను డబ్బు అడగలేదని, అది ఫేక్ అకౌంట్ అని చెప్పాడు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెస్సేజ్ వచ్చింది. బాధితులు ఆ మెస్సేజ్లో ఉన్న లింకును క్లిక్ చేసి యోనోలో యూజర్లో పేరు, పాస్వర్డ్ నమోదు చేశారు.
ఆ తర్వాత తాను రిసీవ్ చేసుకున్న ఓటీపీలను లింక్లో నమోదు చేశారు. వెంటనే బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. డిచ్పల్లి మండలానికి చెందిన మరో యువకుడికి ఇదే తరహాలో మోసం జరిగింది. ఆన్లైన్లో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తుండగా ఎయిర్పోర్టులో జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఓ దుండగుడు వల విసిరాడు. అందుకు కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించాలని షరతు పెట్టాడు. ఈ ఆఫర్కు ఆకర్షితుడైన బాధిత వ్యక్తి ఏకంగా రూ.23,500 చెల్లించాడు.
ఆ తర్వాత డబ్బులు స్వీకరించిన వారితో సంబంధాలు కట్ అయిపోయాయి. ఫోన్ చేస్తే ఎంతకూ కలవదు. ఎలాంటి ఆధారం లేదు. లబోదిబోమనడమే మిగిలింది. ఆర్మూర్, నిజామాబాద్ నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికారు. ఫోన్ ఎత్తిన అవతలి వ్యక్తి మీ సమస్య పరిష్కారం కావాలంటే ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ ఐడీని సైబర్ నేరగాడికి ఇచ్చారు. నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇలా వందలాది కేసులు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి.
బాధితుల కోసం‘1930’
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన బాధితులెవరైనా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్షణం ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లను ట్రేస్ చేయడం సులువవుతుందని, బాధితులు పోగొట్టుకున్న డబ్బును వెనక్కి రప్పించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫిర్యాదుదారుడి ఫోన్ నంబర్, అకౌంట్ ఉన్న బ్యాంక్ పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, మర్చండ్ ఐడీ, యూపీఐడీ నంబర్లు, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, సమయం, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపితే వాటి నంబర్లు, మోసానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వీటితో పోలీసులకు అందిస్తే త్వరితగతిన న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
డిజిటల్ చెల్లింపులు విప్లవాత్మకంగా మారుతున్నప్పటికీ చాలామందిలో అవగాహనా రాహిత్యం ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది. ఈ బలహీనతే సైబర్ నేరగాళ్లకు పండుగలా మారింది. అమాయకులను ఆసరా చేసుకుని ఇట్టే రూ.లక్షల్లో డబ్బులు కాజేస్తుండడం నిత్యకృత్యమైంది. వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో చెల్లింపులకు గూగుల్ పే, ఫోన్ పే వాడకం ఈ మధ్య భారీగా పెరిగింది. డిజిటల్ లావాదేవీలు మంచిదే అయినప్పటికీ ఆన్లైన్ మోసాల నుంచి భద్రతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేమీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
అప్రమత్తంగా ఉండాలి…
ఆర్థిక కార్యకలాపాలన్నీ సింహాభాగం ఈ మధ్య ఆన్లైన్ రూపంలోనే జరుగుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రజలంతా ఈ వ్యవస్థలో లోపాలను గుర్తించి అవగాహన పెంచుకోవాలి. అజాగ్రత్తగా వ్యవహరించడంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతే వెంటనే 100 లేదా 1930 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
– కేఆర్ నాగరాజు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్