వినాయకనగర్, మార్చి 24: జిల్లాలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఓ కిరాణావ్యాపారి సైబర్ మోసగాడి వలలో పడి రూ. లక్షా 6వేలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి వివరాలు.. నగరంలోని రెండోటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దబజార్ ప్రాంతంలో ఉన్న కిరాణాషాపు యజమాని రాజ్కుమార్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి తాను బ్యాంకు ఉద్యోగిని అని, మీ బ్యాంకు ఖాతాకు క్యూఆర్కోడ్ అప్డేట్ చేయాలంటూ నమ్మించాడు. దీంతో షాపు యజమాని తన సెల్ఫోన్ లాక్ఓపెన్ చేసి నకిలీ బ్యాంకు ఉద్యోగి చేతిలో పెట్టి గిరాకీ రావడంతో లోపలికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నకిలీ ఉద్యోగి షాప్ యజమాని సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. మరుసటి రోజు తన ఖాతా నుంచి రూ. లక్షా 6వేలు కాజేసినట్లు గుర్తించిన కిరాణ షాపు యజమాని వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.రాము తెలిపారు.