గాంధారి, డిసెంబర్ 6 : కంది రైతుకు కాలం కలిసొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో కందిసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గినప్పటికీ సకాలంలో వర్షాలు కురియడంతో పంట ఆశాజనకంగా ఉన్నది. సోయా, మక్క జొన్న, మినుము, పెసర తదితర పంటల్లో అంతర పంటగా సాగుచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 15,283 ఎకరాల్లో కందిపంటను సాగు చేస్తున్నారు. కాలం కలిసి రావడంతో అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. పంటను కొనుగోలు చేయడానికి గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికం గా నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. వానకాలంలో రైతులు ప్రధానంగా సోయా, మక్కజొన్న, పత్తి తదితర పంటలను ప్రధానంగా సాగు చేయడంతోపాటు అంతరపంటగా కందిని సాగుచేస్తారు. సోయా, మక్కజొన్న పంటలు మూడు నెలల్లోనే కోతకు రావడంతో, కందిపంటను చీడపీడలు ఆశించకుం డా సంరక్షిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో విత్తుకున్న కంది 160 నుంచి 180 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కంది పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్నది. కాలం అనుకూలించడంతో అధిక దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో కంది సాగు విస్తీర్ణం కొంచెం తగ్గింది. గత సంవత్సరం 18 వేల ఎకరాల్లో కంది సాగు చేయగా, ఈ ఏడాది 15,283 ఎకరాల్లో పంటను వేశారు. నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం, బాన్సువాడ, పెద్ద కొడప్గల్, రామారెడ్డి మండలాల్లో సోయా, మక్కజొన్న, మినుము, పెసరలో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కందిపంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. క్వింటాలుకు రూ. 6300 మద్దతు ధర ఉండడంతో మంచి లాభాలు వస్తాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఒకే రకమైన పంటను సాగు చేస్తే వాతావరణం అనుకూలించని సందర్భాల్లో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాలను పూడ్చుకోవడానికి చాలా మంది రైతులు ఏకకాలంలో రెండు లేదా మూడు పంటలను సాగుచేస్తున్నారు. ప్రధాన పంటలతో ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోయినప్పటికీ అంతర్ పంటలతో ఆ నష్టాన్ని పూడ్చుకొని గట్టెక్కుతున్నారు. ఇందులో భాగంగా సోయా, మక్కజొన్న, మినుము, పెసర పంటల్లో అంతర్ పంటగా కందిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అంతర పంటగా కందిని సాగుచేసిన రైతులకు కాసులు కురిసే అవకాశం ఉన్నది.
ప్రతిరోజూ కంది పైరును పరిశీలించడంతోపాటు చీడపీడలు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చు. పూత, కాత దశలో ఉన్నప్పడు పచ్చపురుగు, లద్దెపురుగు, పేనుబంక వంటి తెగ్గుళ్లు ఆశించే అవకాశాలు ఎక్కువ. వాటి నివారణకు ప్లూబెండాఅమైడ్ అనే రసాయనాన్ని ఎకరానికి 100 ఎంఎల్, లేదా ఇమామెస్టిన్ బెంజోఎట్ అనే మందును 100 ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమ్డాక్లోపెడ్ను పిచికారీ చేయాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి.
-నరేశ్, మండల వ్యవసాయాధికారి, గాంధారిz