నిజామాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మంచి దిగుబడి వచ్చిందన్న సంతోషం ప్రకృతి వారిని ఎక్కువసేపు ఉండనీయలేదు. త్వరగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి పంటను అమ్ముకుందామనుకునేలోపే అకాల వర్షం వారి ఆనందాన్ని ఆవిరి చేసింది. ఆరబోసిన వడ్ల కుప్పలన్నీ హారతి కర్పూరం మాదిరిగా వరదలో కొట్టుకుపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయాల్సిన సంబంధిత అధికారులు ఉన్నచోటే కాకిలెక్కలు చూపించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లగా అధికార యం త్రాంగం రైతులకు భరోసా ఇవ్వకపోవడం గమనార్హం.
యాసంగిలో మరోమారు భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ అన్నదాతలను తీవ్రంగా కుంగదీసింది. కురిసిన కుండపోత వానలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అతి భారీ వానలకు తోడుగా గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. దీంతో ఆరుగాలం సాగులో అన్నదాతకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఊహించని విపత్తుతో రైతులను కోలుకోకుండా చేసింది. ఏపుగా ఎదిగిన వరి పంట నేలవాలి పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కామారెడ్డి జిల్లాలోని చాలా చోట్ల వరి గింజలు నేల రాలి పనికి రాకుండా మారింది. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. వరుసగా ఎదురవుతున్న నష్టాలను తలచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎదుట ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పంట నష్ట పరిహారం ద్వారా రైతులకు సాంత్వన చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ అంశంపై అతీగతీ లేకుండా పోయింది. సకాలంలో పరిహారం అందివ్వడం ద్వారా కర్షకుడి కన్నీటిని తుడిచేలా తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రయత్నిస్తే బాగుండేది. కానీ రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని కొర్రీలు పెట్టి కొంత మందికే సాయం అందించిన కాంగ్రెస్ సర్కారుకు పంట నష్టపోయిన రైతులపై ప్రేమ పుడుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 10లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరి కోత దశకు చేరింది. నేడో రేపో వడ్లు కుప్ప పోసేందుకు సిద్ధమవుతుండగా అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పెద్దమొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డిలోనూ ఇదే దుస్థితి. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండానే వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఈవోలు, మండల వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. కామారెడ్డిలో జిల్లా వ్యవసాయాధికారి విస్తృత పర్యటనలు చేస్తుండగా నిజామాబాద్లో పర్యవేక్షణ కరువైంది. దీంతో కింది స్థాయి వ్యవసాయాధికారుల పనితీరుకు లెక్కాపత్రం లేకపోవడంతో లోపాలు వెలుగుచూస్తున్నాయి. బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బోధన్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు పంట నష్టం వాటిల్లిన రైతులతో మాట్లాడి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఫక్తు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు మాత్రం రైతులు కష్టాల్లో ఉంటే కనుచూపు మేరలో కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది.