ఉపాయం ఉన్నోడు.. ఉపాసం ఉండడు అన్న చందంగా ఈ రైతు తన ఆలోచనే పెట్టుబడిగా పూర్తి విశ్వాసం, పట్టుదలతో భిన్నమైన పంట వేసి అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రైతు కృషి తోడయితే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో నిరూపిస్తున్నాడు. సాధారణంగా రైతులు వరి వేయడం లేదంటే ఆరుతడి పంటలు వేయడం, ఇంకొంత మంది వాణిజ్య పంటలు వేస్తున్నారు. వరి, ఇతర ఏ పంటలు సాగు చేసినా ఇటు ప్రభుత్వంపైనో లేదంటే స్థానిక మార్కెట్పైనో ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఈ రైతు అలా కాదు మంచి డిమాండ్ ఉన్న, అధిక లాభాలు అందించే పంటలు వేయాలని ఆలోచించాడు. దానికోసం ఎక్కడెక్కడో తిరిగాడు. ఇంకేముంది తాను అనుకున్నట్లే భిన్నమైన పంటలు వేసి స్థానిక మార్కెట్ను కాకుండా అంతర్రాష్ట్ర మార్కెట్లో విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జించి ఆదర్శంగా నిలిచాడు ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి.
ఆయిల్ పామ్ సాగులో అంతరపంట
రేకులపల్లి గ్రామ పరిధిలో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో మొదట అందరిలాగే వరి ఇతరత్రా పంటలు వేసి విసిగి వేసారిపోయాడు. వరికి బదులు డిమాండ్ ఉన్న పంటలు వేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న ఆయిల్ పామ్ సాగును తెలుసుకొని ఆ పంటను వేశాడు. అయితే ఈ పంట చేతికి రావాలంటే నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు అంతర పంటగా ఏదైనా వేయాలని ఆలోచించాడు. ఇలా ఆలోచనలు కొనసాగుతుండగానే పని మీద అనంతపురం జిల్లాకు వెళ్లిన రైతు రాజారెడ్డికి అక్కడ ఉత్తరాది వాళ్లు ఇష్టంగా తినే కర్బూజ జాతికి చెందిన ‘మస్క్ మిలన్’ పంటను పరిశీలించాడు. దీంట్లోనే పలు రకాల కర్బూజ పంటలను పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాడు. ఇంకేముంది సొంతూరికి వచ్చి తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను వేశాడు.
ఎంతో శ్రమించా, లాభాలు బాగానే ఉన్నాయి..
వరి ఇతరత్రా పంటలకు బదులు ఏదైనా ఇతర పంట వేయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో బలంగా ఉండేది. దీంతో ప్రభుత్వం ప్రోత్సహించిన ఆయిల్ పామ్ సాగులోనే మస్క్ మిలన్ పంటను అంతర పంటగా వేశాను. మొదటి పంట పూర్తి అవగాహన లేక పంట సాలు దూరంగా వేసుకున్న కానీ ఇప్పుడు అవగాహన వచ్చింది. పలు రకాల కర్బూజ పంటలు వేశాను. ఢిల్లీ మార్కెట్లో ఈ పంటకు బాగా డిమాండ్ ఉంది. అక్కడ దీన్ని కర్బూజ మాదిరి తినడానికి, జ్యూస్, సలాడ్లోకి వాడతారు. ఈ పంట వేయడంతో ఏదైనా భిన్నమైన పంట వేయాలన్న నా కోరిక తీరింది. ఇతర పంటలతో పోలిస్తే అధిక లాభాలు రావడంతో చాలా సంతోషంగా ఉంది. రైతులెవరైనా పంట వేయాలనుకుంటే వారికి పూర్తి సహకారం అందిస్తా.
-దుమాల రాజారెడ్డి, రైతు, రేకులపల్లి
12 ఎకరాల్లో మస్క్ మిలన్ సాగు..
రాజారెడ్డి తన వ్యవసాయక్షేత్రంలోని 12 ఎకరాల్లో నోన్-యూ సీడ్స్ కంపెనీ సహకారంతో పంటకు సంబంధించిన మెళకువలు తెలుసుకొని మస్క్ మిలన్, ఎల్లో, గ్రీన్ తదితర పలు రకాలైన కర్బూజ పంటలు వేశాడు. అనతి కాలంలో పంట పచ్చగా ఎదుగుతూ ఉండడంతో ఆయన మనస్సు సైతం ఉప్పొంగింది. పంట ఎలా ఉంటుందో అని ఆతృత పడ్డాడు. ఆయన కృషి ఫలించింది. చూస్తుండగానే పంట బాగా పండింది.
80 రోజుల పంట…ఎకరానికి రూ.లక్ష ఆదాయం..
మస్క్ మిలన్గా పిలిచే ఈ పంటను ఉత్తరాది వారు సన్ మిలన్గా పిలుస్తారు. ఈ పంట తక్కువ ఖర్చుతో, అధిక దిగుబడి వస్తుంది. ఎకరానికి 8 నుంచి 14 టన్నుల వరకు దిగుబడితో పంట కేవలం 75- 80 రోజుల్లో చేతికి వస్తుంది. అన్ని ఖర్చులు పోగా సుమారు రూ.లక్ష వరకు లాభం గడిస్తున్నాడు. కాగా పంటకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో తానే స్వయంగా వ్యయప్రయాసలకోర్చి ఉత్తరాదికి, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్కు సైతం లారీలో పంటను తీసుకెళ్లి విక్రయించి అధిక లాభాలు ఆర్జించాడు. దీంతో ఈ పంటపై మరింత ఆసక్తి పెంచుకున్న రైతు.. ఇంకొంత విస్తీర్ణంలో పంట వేయాలని నిర్ణయించకున్నాడు.