తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై పాలక మండలి చర్యలకు ఉపక్రమించింది. పాలకవర్గం అనుమతి లేకుండా చేపట్టిన ప్రతి పనిని అక్రమ వ్యవహారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. శుక్రవారం రూసా బిల్డింగ్లో నిర్వహించిన 57వ పాలకవర్గ సమావేశంలో వీసీ తీరు, ఇష్టారాజ్యంగా రిజిస్ట్రార్ల నియామకంపై మరోమారు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్గా యాదగిరే కొనసాగుతారని.. పాలకవర్గ తీర్మానానికి విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ప్రొఫెసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. వీసీ సొంత నిర్ణయాలతో ఇష్టమొచ్చినట్లుగా ఖర్చు చేస్తున్న నిధులు, నియామకాలపై విచారణకు ఏసీబీ రంగంలోకి దిగనున్నది. ఈ మేరకు ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు నిజామాబాద్ సీపీకి లిఖిత పూర్వకంగా ఈసీ ఫిర్యాదు చేసింది. సమాచారం ఇచ్చినప్పటికీ సమావేశానికి వీసీ గైర్హాజరు కావడం గమనార్హం.
నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆగడాలపై పాలకవర్గ సమావేశం మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీయూ ను నడిపించాల్సిన వ్యక్తి ఏకంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, తనకు ఇష్టమొచ్చినట్లుగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపై చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని రూసా బిల్డింగ్లో నిర్వహించిన 57వ పాలకవర్గ సమావేశంలో వీసీ తీరుపై చర్చించారు. సమాచారం ఇచ్చినా ఈసీ మీటింగ్కు రాకపోవడంతో పాటు ఈసీ అనుమతి లేకుండానే మరోమారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ను రిజిస్ట్రార్గా నియమించడంపై చర్చించారు. పాలకవర్గం అనుమతి లేకుండా చేసిన ప్రతి పనిని అక్రమ వ్యవహారం కిందనే ఈసీ సభ్యులంతా నిర్ధారించారు. యూనివర్సిటీలో పైసా ఖర్చు పెట్టాలన్నా… విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలన్న ఈసీలో చర్చించనిదే చేయకూడదని స్పష్టం చేసింది. అలా జరిగిన ప్రతి నిర్ణయంపై చట్టప్రకారం విచారణ చేసి బా ధ్యులైన వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖలకు పాలకవర్గం ఫిర్యాదు సైతం చేసింది. ఇందులో భాగంగానే అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఈసీ ఫిర్యాదు చేసింది.
రిజిస్ట్రార్ యాదగిరే…
వైస్చాన్స్లర్ వర్సెస్ పాలకవర్గం అన్న తీరులో నడుస్తున్న ప్రస్తుత వ్యవహారంలో రిజిస్ట్రార్ల మార్పు అన్నది తెలంగాణ యూనివర్సిటీలో చకచకా జరిగిపోతున్నది. రోజుల వ్యవధిలోనే వైస్చాన్స్లర్ రవీందర్ గుప్తా తనకు ఇష్టమొచ్చిన వ్యక్తులను నియమించుకుంటూ పోతుండడంపై సర్వత్రా దుమారం రేపుతున్నది. ప్రొఫెసర్ రవీందర్ గుప్తా పదవీ కాలంలో 8 సార్లు రిజిస్ట్రార్ల మార్పు జరుగగా ఆరుగురికి బాధ్యతలు మారాయి. ప్రొఫెసర్ నసీమ్ నుంచి మొదలు పెడితే నిర్మలా దేవి వరకు ఇలా రిజిస్ట్రార్ల మార్పు జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలిక్కడ ఏం జరుగుతుందో? అంటూ నోళ్లు వెళ్లబెట్టాల్సిన దుస్థితి దాపురించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలన సవ్యంగా జరగాలంటే వీసీతోపాటు రిజిస్ట్రార్ పోస్టు అత్యంత కీలకం. కానిక్కడ వీసీ ఆగడాలు, నిధుల దుర్వినియోగంతో పాటు రూ.కోట్లు పక్కదారి పడుతున్నట్లుగా స్పష్టం అవుతున్నది. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను రిజిస్ట్రార్గా నియమించుకుంటూ ఇష్టమొచ్చినట్లుగా నిధులు విత్ డ్రా చేస్తున్నట్లు వీసీపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం స్పందించి ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించింది. వీసీ మాత్రం ససేమిరా అన్నట్లుగా ప్రవర్తిస్తూ నెలకొకరిని మార్చుకుంటూ పోతున్నారు. తాజాగా నిర్మలాదేవిని ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకురావడం విడ్డూరంగా మారింది. ఆమె రాక సందర్భంగా టీయూలో జరుగుతున్న రగడ కాస్త ఓయూకు సైతం పాకినట్లు అయ్యింది. రిలీవ్ ఆర్డర్ను ఒకే రోజులో రద్దు చేసిన ఘటనతోనూ రెండు విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు అస్పష్టత, గందరగోళం ఏర్పడింది.
రంగంలోకి ఏసీబీ, విజిలెన్స్…
పాలకవర్గం తీర్మానాలకు విరుద్ధంగా వీసీ సొంత నిర్ణయాలతో ఇష్టమొచ్చినట్లుగా ఖర్చు చేస్తున్న రూ.కోట్ల నిధులు, ఇష్టానుసారంగా నియామకాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అనేక ఘటనలపై విచారణకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగనున్నది. దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైతం టీయూ వ్యవహారంపై విచారణ చేయబోతున్నది. ఈ మేరకు 57వ తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గ సమావేశంలో సభ్యులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వీసీ రవీందర్ గుప్తా, ఈసీ సభ్యుడు రాజేందర్ రెడ్డి మినహాయిస్తే మిగిలిన 10 మంది సభ్యులు హాజరవ్వడంతో పూర్తి స్థాయి కోరంతో ఈసీ సమావేశం శుక్రవారం జరిగింది. వాకాటి కరుణ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ను చైర్మన్గా నియమించి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వీసీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా ఏసీబీ డైరెక్టర్ జనరల్కు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో రిజిస్ట్రార్ కార్యాలయంలో సంబంధంలేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను టీయూ పాలకవర్గం కోరింది. రిజిస్ట్రార్గా పాలకవర్గం నియమించిన యాదగిరి మినహా ఇతరులెవ్వరూ ఆ స్థానంలో కూర్చునే పరిస్థితి లేదని సీపీకి ఈసీ వివరించింది. అందుకు అనుకూలమైన భద్రతను, బందోబస్తును కల్పించాలని ఈసీ కోరింది.
ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు…
పాలకవర్గంలో తీర్మానించిన దానికి విరుద్ధంగా ప్రొఫెసర్ యాదగిరికి బదులుగా టీయూ వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ప్రొఫెసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈసీ మీటింగ్లో నిర్ణయించారు. శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవీలపై త్వరలోనే చర్యలకు ఈసీ ఉపక్రమించనున్నది. ఈ ముగ్గురు కూడా ఈసీ అనుమతి లేకుండానే రిజిస్ట్రార్ స్థానంలో ఆసీనులై పలు ఆర్థిక లావాదేవీల్లో పాత్రదారులైతే కఠినమైన చర్యలకు బాధ్యులవుతారని ఈసీ స్పష్టం చేసింది. ప్రొఫెసర్ యాదగిరి నియామకానికి ముందు రిజిస్ట్రార్గా పని చేసిన ప్రొఫెసర్ కనకయ్య వ్యవహారంపైనా లోతైన విచారణ చేసి తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోకుండా వీసీ అనైతికంగా మద్దతు తెలిపి యూనివర్సిటీ పరువును బజారుకు ఈడుస్తున్న వ్యక్తులపైనా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందులో కొంత మంది కార్యాలయ సిబ్బంది ప్రమేయంపై కన్నేసి ఉంచారు. వీసీ ఆగడాలను అడ్డం పెట్టుకొని కొంత మంది ఇష్టానుసారంగా చెలరేగి పోయినట్లుగా ఈసీ దృష్టికి వచ్చింది. మూడు రోజుల క్రితం రిజిస్ట్రార్గా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ నిర్మలా దేవికి తెలంగాణ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని ఈసీ స్పష్టం చేసింది. వీసీ ఆదేశాలతో ఆర్థిక లావాదేవీల్లో పాలుపంచుకుంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుందన్న సందేశాన్ని ఈసీ వెలువరించింది.
నవీన్ మిట్టల్పై వీసీ లేఖాస్త్రం…
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ రవీందర్ గుప్తా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్పై లేఖాస్ర్తాన్ని సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు నవీన్ మిట్టల్పై ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొంటూ రెండు పేజీల పత్రికా ప్రకటనను వీసీ విడుదల చేశారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్పై వీసీ విరుచుకుపడ్డారు. నవీన్ మిట్టల్ వ్యవహారంతోనే తెలంగాణ యూనివర్సిటీ పరువు పోతున్నదని అందులో వీసీ పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక కీలక బాధ్యతలు అప్పగించగా టీయూపైనే దృష్టి కేంద్రకరించడంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. పైగా తన వెనుక గోతులు తొవ్వుతూ ఇరుకున పెట్టేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 19న జరిగిన ఈసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లుబాటు కావన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని అడ్డం పెట్టుకొని టీయూపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు నవీన్ మిట్టల్ వ్యవహరిస్తున్నారని వీసీ తన లేఖలో పేర్కొన్నారు.