Kotagiri | కోటగిరి, మే 16 : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ట్రాలీ ఆటోకు తాడు కట్టి లాగుతూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇంకా పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో అన్నింటి విఫలమయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రూ.300 ఉన్న గ్యాస్ ధర బీజేపీ హాయంలో రూ.1000కి పైగా చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజుల గ్యాస్ దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. చిరు వ్యాపారులకు కమర్షియల్ గ్యాస్ దొరకక హోటల్లు మూతపడడే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి ప్రజలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు.
బీజేపీ హయాంలోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై జీఎస్టీ తెచ్చిందని పెట్రోల్, డీజిల్ పై జీఎస్టీ ఎత్తివేస్తే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజల పక్షాన ఆందోళన, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, రాజు, రాములు, హనుమండ్లు, అన్సార్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.