వినాయక్నగర్, ఫిబ్రవరి 12: నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా కిడ్నాప్ ముఠాలు లేవని సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ స్పష్టంచేశారు. చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కమిషనరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ వన్ టౌన్, రూరల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మూడు కిడ్నాప్ కేసులను వెంటనే ఛేదించామని, మూడు కేసుల నిందితులకు ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధాలు లేవని తమ విచారణలో తేలిందన్నారు. కొన్ని రోజులుగా అనుమానాస్పదంగా కనిపించేవారిపై ప్రజలు అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని, అనుమానితులపై దాడులు చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 15చోట్ల అనుమానిత వ్యక్తులపై దాడి ఘటనలు చోటు చేసుకున్నాయని, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిని గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు.
సీఎం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారితోపాటు వినియోగిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. మత్తు పదార్థాల చెలామణి జరిగినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పిల్లల బంగారు భవిష్యత్తు పాడవ్వకుండా సహకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ జయరాం, ట్రెయినీ ఐపీఎస్ చైతన్యరెడ్డి పాల్గొన్నారు.