బాన్సువాడ రూరల్, జూలై 18 : విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఒప్పంద అధ్యాపకులపై అధికారులు వేటువేశారు. బాన్సువాడ మండలంలోని ఓ పాఠశాల/కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు ఒప్పంద అధ్యాపకులు వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విద్యార్థినులు చేసిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతో వారిద్దరినీ జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. విద్యార్థినులపై వేధింపుల విషయమై కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ శనివారం తెలిపారు.
ఎల్లారెడ్డి, జూలై 18: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకుడు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నిజాంను సస్పెండ్ చేస్తూ ఇంటర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా అధ్యాపకురాలిని వేధింపులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం విచారణ చేపట్టి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధ్యాపకురాలిని కరీంనగర్కు అటాచ్ చేసినట్లు సమాచారం.