భీమ్గల్, ఏప్రిల్ 8: వాగుల్లో వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అవసరం ఉన్న ప్రదేశాల్లో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని భీమ్గల్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని కప్పలవాగుపై ఐదు చెక్డ్యాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రభుత్వానికి నివేదికలను సమర్పించగా.. వెంటనే రూ.9.45 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో నాలుగు చెక్డ్యాముల నిర్మాణం ఇప్పటికే పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరొక చెక్డ్యామ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
వృథాగా నీరు.. ఒడిసి పట్టుకున్నారు..
వానకాలంలో కురిసిన వర్షాలకు మండలంలోని కప్పలవాగులో నీరు ఉధృతంగా ప్రవహించేది. పారుతున్న నీరు వాగు పరిసర గ్రామాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. ఎండాకాలంలో వాగులో చుక్క నీరు కూడా ఉండేది కాదు. వాగులో వృథాగా పోయే నీటిని వినియోగించుకోవాలని ప్రజలు భావించారు. విషయాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన చెక్డ్యామ్లు నిర్మించాలని, అందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
మంత్రి సూచనలతో కప్పలవాగుపై ఐదు ప్రదేశాల్లో చెక్డ్యామ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం అనుమతులు ఇస్తూ నిధులను సైతం మంజూరు చేసింది. మంత్రి ప్రశాంత్రెడ్డి చెక్డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పనులు చకచకా పూర్తయ్యాయి. చెక్డ్యాముల్లో ప్రస్తుతం నీరు నిల్వ ఉండడంతో పరిసర పది గ్రామాల్లోని బోరు బావుల్లో నీరు ఉబికి వస్తున్నది. వట్టిపోయిన బోర్లు సైతం ఎండాకాలంలో నీరు పోస్తున్నాయి. దీంతో రైతులు రెండు పంటలనూ పండించుకుంటున్నారు. చెక్డ్యాముల్లో నీరు నిల్వ ఉండడంతో మత్స్యకారులకు సైతం ఉపాధి లభిస్తున్నది.
మంచి రోజులు వచ్చాయ్..
కేవలం చెరువులపై ఆధారపడి జీవించే మాకు మంత్రి ప్రశాం త్ రెడ్డి చొరవతో మంచి రోజు లు వచ్చాయి. చెక్డ్యామ్లో కూడా చెరువుల్లో పట్టినట్లు చేపలను పడుతున్నామంటే.. దాని కి కారణం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృషి. చేపలు పుష్కలంగా దొరకడంతో అదనపు ఆదాయం లభిస్తున్నది.
– గంగాధర్, మత్స్యకారుడు, భీమ్గల్
రెండు పంటలూ పండిస్తున్నాం..
గతంలో వానకాలంలో మాత్రమే పంటలు పండేవి. నీళ్లు లేక ఎండాకాలం పొలాలన్నీ బీడుగా ఉండే వి. చెక్డ్యామ్ నిర్మించడంతో రెండు పంటలూ పండిస్తున్నాం. బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. తాగు, సాగు నీటిని ఢోకా లేకుం డా పోయింది. రైతుల గురించి చెక్డ్యామ్లను నిర్మించిన మంత్రి వేములకు ధన్యవాదాలు.
– బొదిరె సుమన్, రైతు, భీమ్గల్
చెక్డ్యామ్నిర్మించిన ప్రదేశం వ్యయం
భీమ్గల్ రూ.నాలుగు కోట్లు
గోన్గొప్పుల రూ.మూడు కోట్లు
ముచ్కుర్(ఒకటి) రూ.1.01కోట్లు
(రెండోది) రూ.69లక్షలు
జాగిర్యాల్ రూ.75లక్షలు