నవీపేట, అక్టోబర్ 9 : సీమాంధ్ర పాలకులు వ్యవసాయం దండుగ అన్నచోటనే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మొదటగా వ్యవసాయ రంగంపైనే దృష్టి పెట్టారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూనే రాష్ర్టాన్ని పంటలతో సస్యశ్యామలం చేసేందుకు ఫుష్కలంగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా వాగుల నుంచి నీరు వృథాగా పోకుండా ఎక్కడికక్కడ చెక్ డ్యాములను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు.
రూ.9.50 కోట్లతో చెక్డ్యాములు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ కృషితో నవీపేట మండలంలోని పూలాంగ్ వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రెండు చెక్డ్యాములను మంజూరు చేసింది. రూ. 9.50కోట్లు విడుదలైన వెంటనే లింగాపూర్, నిజాంపూర్ గ్రామాల వద్ద పనులను చేపట్టి చకచకా చెక్డ్యాములను నిర్మించారు. పూలాంగ్ వాగు నుంచి వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేశారు. దీంతో ఆయకట్టు ప్రాంతాలైన లింగాపూర్, నిజాంపూర్, తల్వేద, చిక్లీ, గుంజిలీ తదితర గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఎత్తిపోయిన బోరు బావులు ఫుల్లుగా పోస్తున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రెండు పంటలకూ ఢోకా లేకుండా పోయింది. ఆయా గ్రామాల పరిధిలో కరువు పరారయ్యిందని రైతులు తెలిపారు. దాదాపు 600 ఎకరాల్లో రెండు పంటలనూ ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటామని అన్నారు. చెక్డ్యామ్ నిర్మాణానికి కృషి చేసి, సాగునీటి ఇబ్బందులను తొలగించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్తోపాటు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
భూగర్భ జలాలు పెరిగాయి..
పూలాంగ్ వాగుపై నిజాంపూర్, లింగాపూర్ గ్రామాల శివారులో చెక్ డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయి. బోరు బావుల ద్వారా రెండు పంటలకు పుష్కలంగా నీరు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు కరువు పరిస్థితి అసలే లేదు. సాగునీటి ఇబ్బందులు తీర్చిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు.
– గడ్డం మల్లేశ్, రైతు, నిజాంపూర్
రైతుల కోసం ప్రభుత్వం కృషి
నేను ఏటా ఐదెకరాలు కౌలు తీసుకొని సాగు చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షే మం కోసం కృషి చేస్తున్నది. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎమ్మెల్యే షకీల్ రెండు చెక్ డ్యామ్లకు నిధులు మంజూరు చేయించారు. పనులు సైతం పూర్తయ్యాయి. సాగునీరు బాధలు తీర్చి రైతురాజ్యం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.
– బత్తూర్ సాయిలు, సర్పంచ్, లింగాపూర్