ఇందల్వాయి, నవంబర్ 24: కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులను పాటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింక్లర్ల ప్రాముఖ్యతపై అధికారుల అవగాహన, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ఆధారంగా పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రభుత్వం సైతం పందిరి సాగు ద్వారా కూరగాయలు పండించే రైతులకు సబ్సిడీ అందిస్తుండడంతో చాలా మంది ముందుకు వస్తున్నారు. కాకర, బీర, దొండ, సోరకాయ విత్తనాలు నాటిన కొద్దిరోజులకే పంట చేతికి వస్తున్నది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తున్నాయి.
అర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్..
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన తాడెం గంగారాం అనే రైతు అర ఎకరం పొలంలో కోల్కత్తా రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఆధునిక సాగు విధానాలను చూసి వాటిని పండించాలన్న తపనతో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందుకొచ్చాడు. సొంతంగా సిమెంట్ దిమ్మెలు తయారు చేసుకొని పక్కా కొలతల ప్రకారం పంట సాగు చేశాడు. జూన్లో దిగుబడి ప్రారంభమైంది. మొదటి కాతలో క్వింటాలు దిగుబడి రాగా రూ.20వేల ఆదాయం వచ్చింది. ప్రతి 45రోజులకోసారి దిగుబడి వస్తుంది. అంతర పంటగా కందిసాగు చేస్తూ తోట చుట్టూ ప్రయోగాత్మకంగా 10 మహాఘని మొక్కలు పెంచుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్, ఇతర కూరగాయల జాగ్రత్తల నిమిత్తం పంట పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. రైతు ఆసక్తిని గుర్తించిన ఉద్యానశాఖ అధికారులు రాయితీపై పందిరి సాగు చేసుకోవాలని సూచించారు.
పందిరి సాగుతో కూరగాయలు
అధికారుల సూచన మేరకు అర ఎకరంలో పందిరి వేశారు. దీనికి సుమారు రూ.లక్షా 20వేల ఖర్చు కాగా, రూ.50వేల రాయితీ వచ్చింది. జూన్లో తీగలపై బీర, మధ్యలో వంకాయ, టమాట, మిరప వేశాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే బీరకాయ పంటకు రూ.20వేల ఆదాయం పొందాడు. అధిక వర్షాలతో వంకాయ పంట నష్టపోగా దాన్ని తొలగించి ఆ స్థానంలో దొండ, తీగజాతి పంటలను సాగు చేశాడు. తీగజాతి సాగులో దిగుబడి అధికంగా వస్తుంది. ఆరు నెలల్లో ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తే సుమారు లక్ష వరకు ఆదాయం వచ్చింది.
భలే లాభాలు..
పందిరి సాగుతో లాభాలు బాగానే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి పెరిగింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు నిరంతరం ఆదాయం వస్తుంది. పందిరి సాగులో దొండకాయ, చిక్కుడుకాయ వేయడం ద్వారా పెట్టుబడిపోను లాభం వస్తుంది.
– తాడెం గంగారాం