నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 24 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు ఇలావున్నాయి. 2009వ బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్గా ఉన్న కోటి గతంలో భీమ్గల్లో విధులు నిర్వర్తించి అక్కడి నుంచి బదిలీపై నిజామాబాద్ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. నగరంలోని మహాలక్ష్మి నగరలోని కోటి శనివారం నైట్ డ్యూటీ చేసి స్టేషన్లోనే ఉన్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఠాణాలో ఇతర సిబ్బందితో కలిసి రోల్కాల్లో పాల్గొన్నాడు. 10 గంటలకు డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యాక ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఇంతలోనే తనకు తిప్పినట్లు అవుతుందని కొద్ది సమయం పాటు రెస్టు తీసుకుంటానని స్టేషన్ పై అంతస్తులో ఉన్న హాల్లోకి వెళ్లాడు. అప్పుడే వాంతులు కావడంతో పాటు చెమటలు పట్టి కింద పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రోజా, పిల్లలు సాన్విక,త్రిషిక ఉన్నారు. కోటి మృతితో తోటి సిబ్బంది, బ్యాచ్మెట్స్ తీవ్ర ద్రిగ్భాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదనపు డీసీపీ జయరామ్, ఏసీపీ కిరణ్ కుమార్, నార్త్ రూరల్ సీఐ సతీశ్, వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబు కోటి మృతదేహానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కోసం ఆయన సతీమణికి రూ.20వేలు అందజేశారు.