భిక్కనూరు, నవంబర్ 10: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభకు జనాలను తీసుకెళ్తామని చెప్పి.. వదిలేసి వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సభకు రావాలని గురువారం రాత్రి ఇంటింటికీ వెళ్లి పేర్లు నమోదు చేసుకున్నారు. తీరా శుక్రవారం ఉదయం సభకు వెళ్లే సమయంలో కొన్ని కాలనీలకు చెందిన మహిళలను తీసుకెళ్లి, మరికొంత మందిని అక్కడే వదిలేశారు. దీంతో మండిపడ్డ మహిళలు స్థానిక కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించగా, మరో వాహనం తెప్పిస్తామని చెప్పి ఎలాంటి వాహనం కేటాయించలేదు.
చివరికి గట్టిగా ప్రశ్నిస్తే దండం పెడతాం, తిరిగి ఇండ్లకు వెళ్లిపోవాలని అన్నారని మహిళలు తెలిపారు. సభకు రావాలని పేర్లు నమోదు చేసుకొని, తమను తీసుకెళ్లకుండా తమ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు స్థానిక కాలనీ రోడ్డుపైనే ఉన్న మహిళలు.. రాత్రి సభ నుంచి తిరిగి వచ్చిన నాయకులను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వచ్చి సముదాయించినా వినకపోవడంతో పేర్లు నమోదు చేసుకున్న వారికి శనివారం డబ్బులు చెల్లిస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.