మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప కూడా దాటవన్నట్లు మారింది కాంగ్రెస్ పార్టీ తీరు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై పోటీకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట నిర్వహించిన తొలిసభ జనంలేక వెలవెలబోయింది. మరోవైపు ఈ పరిణామంతో ఉన్న కాస్త క్యాడర్ సైతం అంతర్మథనంలో పడిపోయింది. కేసీఆర్ను ఢీకొడతానని బీరాలు పలికిన షబ్బీర్ తోక ముడిచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వెళ్లిపోవడంతో క్యాడర్ను ముందుకు నడిపించే వారే కరువయ్యారు. శుక్రవారం నిర్వహించిన రేవంత్రెడ్డి సభే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఎవ్వరినీ ఇక్కడి జనం పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్కు కనీస పోటీ కూడా లేదని తేటతెల్లం అయ్యింది. బీసీ డిక్లరేషన్ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో హస్తం క్యాడర్ పరేషాన్లో పడిపోయింది.
నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు కోసం నానా తంటాలు పడిన హస్తం పార్టీకి ప్రస్తుతం క్యాడర్ను నడిపించే నాథుడే కరువయ్యారు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు పోటీగా దిగిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన తొలి సభ తుస్సుమనడంతో క్యాడర్లో తీవ్ర నిరాశ అలుముకున్నది. రణభేరి సభను ముగించుకొని హైదరాబాద్కు రేవంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి షబ్బీర్ అలీ వెళ్లి పోవడంతో కాంగ్రెస్ను ముందుకు తీసుకెళ్లే వారే కరువయ్యారు. మొన్నటి వరకు కేసీఆర్పై పోటీచేస్తానని చెప్పిన షబ్బీర్ అలీ ఏకంగా తోకముడిచి పారిపోవడంపై జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ను ఎదుర్కోవడం కష్టమైన పనిగా హస్తం పార్టీ గ్రహించింది. కనీసం రేవంత్ రెడ్డి నిర్వహించిన తొలి కార్యక్రమం విజయవంతం కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పక్క పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలిసింది. కేసీఆర్పై పోటీచేయడం కన్నా గులాబీ కండువా కప్పుకోవడం గౌరవప్రదంగా ఉంటుందన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
కేసీఆర్ను ఎదుర్కొనేందుకు భారీ ప్రకటనలు చేసిన వ్యక్తులంతా రణరంగంలో పో రాటం చేసేటప్పటికీ మాటలన్నీ చిత్తవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీతో కనీసం పోలిక లేదన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్కు పోటీ అన్నదే లేదన్న విధంగా శుక్రవారం నాటి సభ తేటతెల్లం చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రాంతానికి ఏ రకమైన సంబం ధం లేదు. తెలంగాణ ఉద్యమంలోనూ ఈ ప్రాంతంతో కనీసం అనుబంధం కూడా రేవంత్ రెడ్డి అనుభవంలో లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉద్యమ గడ్డపై ప్రచారం చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ కోసం సాగిన పోరాట సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉంటూ సమైక్య పాలకుల కనుసన్నల్లో ఉద్యమాన్ని కించపరిచే పనులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నా యి. స్వరాష్ట్ర సాకారం కోసం జరిగిన పోరాటంలో పెను ఉద్యమాలకు వేదికగా నిలిచిన కామారెడ్డిలో నాటి ఉద్యమకారుల నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ శూన్యంగా మిగులుతున్నది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పోలికే లేదన్న వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి.
కేసీఆర్పై పోటీ చేస్తామంటూ తొడగొట్టి సవాల్ విసిరిన షబ్బీర్ అలీ అనూహ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మారడంతో శ్రేణుల్లో అనుమానాలు పెరిగాయి. బీఆర్ఎస్ అధినేతతో ఢీ కొడతానంటూ చెప్పిన వ్యక్తి సడెన్గా మాట మార్చడం, చెప్పా పెట్టకుండా క్యా డర్ను రోడ్డున పడేసి పీసీసీ చీఫ్ వెంట తిరగాలంటూ హుకుం జారీ చేయడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. షబ్బీర్ నిర్ణయం మార్పు వెనుక జరిగిన తతంగం ఏమిటోనంటూ కాంగ్రెస్ పా ర్టీలో జోరుగా చర్చ నడుస్తున్నది. నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్, బీజేపీ కు మ్మక్కు రాజకీయాలకు పాల్పడినట్లే కా మారెడ్డిలోనూ దుష్ట రాజకీయానికి కాం గ్రెస్ ప్రయత్నిస్తుందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు ఖాయమై మెజార్టీ కోసం తాపత్రయపడుతున్న గులాబీ పార్టీ రోజురోజుకూ ప్రచారంలో దూసుకుపోతుంటే షబ్బీర్ అలీ కచ్చితమైన సమయంలో చేతులెత్తేయడం తగదన్నట్లుగా క్యాడర్ చెబుతున్నది. షబ్బీర్ అలీ అకస్మాత్తుగా నియోజకవర్గ మార్పుతోపాటు బీసీ డిక్లరేషన్ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో కోలుకోలేని విధంగా హస్తం క్యాడర్ పరేషాన్లో పడింది. పీసీసీ చీఫ్ స్వయంగా వచ్చి కామారెడ్డిలో పోటీచేస్తున్నారని జబ్బలు చర్చుకున్న నేతలకు కాంగ్రెస్ సభ జరిగిన తీరుతో వాస్తవాలు అవగతమైనట్లుగా తెలుస్తున్నది.
డిక్లరేషన్ల పేరిట తెలంగాణ అంతటా సభలను నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంటున్నది. ఆశించిన స్థాయిలో స్పందన ఎక్కడ కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో క్యాడర్ కొట్టుమిట్టాడుతున్నది. అగ్రనాయకత్వాన్ని పట్టుకొచ్చి ప్రచారం చేయిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నది. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యమే లేదు. 2014, 2018 ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన భారత రాష్ట్ర సమితి తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నది. 2023 అసెంబ్లీ పోరులోనూ గత ఫలితాలే రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఆశలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అందుకు శుక్రవారం కాంగ్రెస్ రణభేరి సభనే చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులను ఎవ్వరూ ఇక్కడి జనాలు పట్టించుకోలేదు. మొన్నటి వరకు కామారెడ్డిలోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేసిన షబ్బీర్ అలీని కూడా ప్రజలు కనీసం పరిగణలోకి తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు.