నిట్టనిలువునా చీలిన కాంగ్రెస్ రచ్చబండ
బీర్కూర్ మండలంలో వర్గపోరు
బీర్కూర్, మే 28 : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర్దిచెబుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం మాదంటే మాది అనే మాదిరిగా వర్గపోరు బయటపడుతోంది. శనివారం బీర్కూర్ మండల కేంద్రంలో రచ్చబండ నిర్వహించాల్సి ఉండగా.. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకొని టెంట్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బీర్కూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రచ్చబండ సందర్భంగా గ్రామంలో నిర్వహించాల్సిన ర్యాలీకి త్వరగా హాజరుకాలేదు.
ర్యాలీలో పట్టుమని పది మంది కూడా లేకపోవడం గమనార్హం. కొందరు ర్యాలీ అనంతరం ఏదో మొక్కుబడిగా రచ్చబండ కార్యక్రమానికి రావడం కనిపించింది. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ఒక్క ఇల్లునైనా కట్టించారా? ఒక్క ఇంటికైనా తాగునీటిని అందించారా అంటూ విమర్శలు గుప్పించారు. అంటే ఈ మాటలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఒప్పుకోవడమే. ఇదిలా ఉండగా, మరోపక్క నిజామాబాద్ జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్సింగ్ ఆధ్వర్యంలో మదన్మోహన్ వర్గం మండలంలోని చించోలి, అన్నారం, వీరాపూర్, నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాట్లాడారు.