ఆర్మూర్, ఆగస్టు 11: ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన కురుమ, నాయీ బ్రాహ్మణ, గౌడ, పద్మశాలీ సంఘాల ప్రతినిధులు, ఆర్మూర్ పట్టణంలోని లారీ అసోసియేషన్ సభ్యులు, ఇటీవల చేపూర్ గ్రామ పంచాయతీ నుంచి నూతన జీపీగా ఏర్పడిన పల్లె గ్రామస్తులు జీవన్రెడ్డికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశమే అబ్బురపడే 450 పథకాల సమాహారమని తెలిపారు. తెలంగాణ మోడల్పై దేశంతో పాటు ప్రపంచమంతా చర్చ జరుగుతోందన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
సంపద పెంచడం , పేదలకు పంచడం సీఎం కేసీఆర్కే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం దేశంలోని ఏ రాష్ట్రంలో లేరన్నారు. రాష్ట్రంలో ఇంత ప్రగతిని గతంలో ఏనాడైనా చూశామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఏనాడైనా ఆర్మూర్ అభివృద్ధిని పట్టించుకున్నాయా? అని నిలదీశారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమని మండిపడ్డారు. ఆర్మూర్లో అభివృద్ధి నిరోధకులకు చోటు లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో బీజేపీ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. మూడు వేల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్కు సకల కులాలు సమానమేనని, ఆర్మూర్లో వివిధ కులాలకు 17 ఫంక్షన్హాళ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. గృహలక్ష్మి పథకం ద్వారా మూడు వేల ఇండ్ల నిర్మాణం చేపడతామని, నాలుగు వేల మం దికి ఇండ్ల స్థలాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పాలన సాగుతున్నదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్కే లభిస్తోందన్నారు. తాను సైతం ఆర్మూర్ ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ ర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.