కామారెడ్డి (నమస్తే తెలంగాణ), జూలై 10 : సమైక్యాంధ్రలో అకాలవర్షాలతో పంటలను కోల్పోతే రైతన్నలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం.. నష్టపోయిన పంటకు పరిహారాన్ని రెండు, మూడేండ్లకు ఇవ్వడం జరిగేది. కానీ స్వరాష్ట్రంలో రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వం.. వారి బాధను అర్థం చేసుకొని, రైతుల కష్టాన్ని నీళ్ల పాలు చేయకుండా, రెండు నెలల్లోపే పరిహారాన్ని అందజేసి ధైర్యం ఇస్తున్నది. రైతు పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేసిన విషయం విదితమే. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు రూ. 200 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో యాసంగిలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలోని 26,584 మంది రైతులకు రూ.25,78,977 పరిహారాన్ని మంజూరు చేసింది. మొత్తం 25,749 ఎకరాల భూమిలో పంట నష్టం వాటిల్లింది. ఒక్కొక్క ఎకరానికి రూ.10 వేల చొప్పున మంజూరు చేసింది.
రైతన్నలకు ధైర్యమిచ్చిన స్పీకర్, ఎమ్మెల్యేలు
మే నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటలను కోల్పోయిన రైతులకు నాలుగు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అండగా నిలిచారు. సుమారు వారం పాటు కురిసిన వర్షాలతో జిల్లాలో పంట నష్టం వాటిల్లగా.. దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యేలు సందర్శించి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తూ రైతులను ఓదార్చుతూ, పంట నష్టం వివరాలను తెలుసుకొంటూ, ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేవిధంగా కృషి చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని రైతుల్లో భరోసా నింపారు. గ్రామీణ స్థాయిలో ఏఈవోలు దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. మే నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదికను అందజేశారు.
యాసంగిలో 4.14 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో యాసంగిలో 4,14,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. వీటిలో వరి పంటను 2.59 లక్షల ఎకరాల్లో, లక్ష ఎకరాల్లో శనగ, 55 వేల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేశారు. అకాలవర్షం వరి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట దెబ్బతినడం, ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. 33 శాతం కన్నా అధికంగా పంట నష్టం వాటిల్లితే అధికారులు రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంట 25,749 ఎకరాల్లో నమోదైంది. 31,930 ఎకరాల్లో పాక్షికంగా వరి దెబ్బతిన్నది. మరో మూడు, నాలుగు రోజుల్లో నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ కానున్నది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నష్ట పరిహారం మంజూరు చేయడం సంతోషకరం
పిట్లం, జూలై 10 : అకాలవర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేయడం సంతోషంగా ఉన్నది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి నేల రాలింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం కోసం పంట నష్టం మంజూరుకు జీవో విడుదల చేయడం సంతోషకర విషయం.
-ఈశ్వరప్ప, రైతు, కంభాపూర్, పిట్లం మండలం
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలరాలింది. వ్యవసాయాధికారులు గ్రామాల్లో సర్వే చేసి, నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పంట నష్ట పరిహారం మంజూరు చేసి రైతులకు బాసటగా నిలిచారు. రైతులకు చేస్తున్న సేవలు మరువలేనివి. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– రాజు, రైతు, కంభాపూర్, పిట్లం మండలం
ప్రభుత్వం మాటపై నిలబడింది
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడింది. రైతులు ఆరు మాసాలపాటు కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి పూర్తిగా నేలరాలడంతో రైతులు బాధ పడ్డారు. పంట నష్టపరిహారం చెల్లింపు విషయంలో రైతులను ఆదుకుంటామని చెప్పి, నష్ట పరిహారాన్ని మంజూరు చేసి ఇచ్చిన మాటపై నిలబడింది.
-బసప్ప, రైతు, కంభాపూర్, పిట్లం మండలం
మూడు, నాలుగు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
పంట నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం అండగా ఉన్నది. జిల్లాలోని రైతులకు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. అర్హులైన రైతులందరికీ మరో మూడు, నాలుగు రోజుల్లో నష్టపరిహారం అందనున్నది. రైతుబంధు సహాయం కింద వానకాలం సీజన్ కోసం ప్రభుత్వం జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.200 కోట్లను ఇప్పటికే జమచేసింది.
– వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి