నిజామాబాద్, మే 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నమ్మించి నట్టేట ముంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. ఎన్నికలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశంలో 5 రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం మోనం పాటిస్తూ వచ్చింది. ధరల పెరుగుదల ఉండదంటూ ప్రకటనలు గుప్పించింది. ఓట్ల పండుగ ముగిసిందో లేదో ప్రజలపై గ్యాస్ బాంబ్ను పేల్చుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సబ్కా సాత్… సబ్కా వికాస్ అంటూ నినాదాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వ వ్యవహారంపై సర్వత్రా వ్యతిరేకత వెలుగు చూస్తోంది.
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే సారి 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై రూ.994 పెంచింది. ఈ స్థాయిలో భారీగా ధర పెంచడంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గడిచిన ఐదు నెలల్లో భారీగా వాణిజ్య సిలిండర్a ధర పెంచారు. గృహ సిలిండర్పైనా మార్చి నెలలో రూ.60 పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచి సామాన్యుల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోంది. పశ్చిమాసియా యుద్ధంతో ఇండియాకు ఇబ్బంది లేదని ప్రచారం కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. మోదీ దౌత్యనీతి గొప్పదంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు దొడ్డి దారిలో ధరలను పెంచి భయోత్పాన్ని సృష్టిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
వాణిజ్య సిలిండర్ ధర గడిచిన ఆరు నెలల్లో దాదాపుగా రెట్టింపు అయ్యింది. 50శాతం మేర ధర పెరిగింది. డిసెంబర్ 2025లో వాణిజ్య సిలిండర్ 19కిలోల ధర రూ.1840 మాత్రమే ఉండేది. జనవరిలో రూ.112 పెంచారు. ఫిబ్రవరి రూ.49 భారం మోపారు. మార్చిలో రూ.144 చొప్పున అదనంగా వడ్డించారు. ఏప్రిల్లో ఆకస్మికంగా రూ.214 చొప్పున ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. మే 1న కార్మికుల దినోత్సవం రోజునే అత్యధికంగా రూ.994 పెంచడంతో రికార్డు స్థాయికి వాణిజ్య సిలిండర్ ధర చేరుకుంది. ఐదు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధర సరాసరి రూ.1513 పెరిగింది.
గృహ సిలిండర్ 14.2కిలోల ధర ప్రస్తుతం రూ.988.50 పలుకుతోంది. మార్చిలో రూ.60 పెంచారు. ఫిబ్రవరిలో రూ. 928.50 ఉండగా పెరిగిన ధరలతో జనాలు సతమతం అవుతున్నారు. మోదీ సర్కారు పాలనలో సామాన్యులు బతకలేక పోతున్నారు. ప్రజల భావోద్వేగంతో ఆటలాడుకుంటోన్న బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలను వ్యాప్తి చేస్తూ వ్యతిరేకత నుంచి తప్పించుకుంటోంది. తప్పుడు సమాచారాన్ని జనాలంతా నమ్ముతూ అసలు వాస్తవాన్ని తెలుసుకోలేక పోతున్నారు.
వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో ప్రధానంగా వ్యాపార, వాణిజ్య అవసరాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. గ్యాస్ సిలిండర్ ఆధారంగా అనేక వ్యాపారాలు నడుస్తుంటాయి. ప్రధానంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లలో వంటలు అన్నీ ఎల్పీజీ గ్యాస్పై ఆధారపడి నడుస్తున్నాయి. భారీగా పెరిగిన ధరలతో ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది. యుద్ధం బూచీని సాకుగా చూపి ఇప్పటికే కొంత మంది టిఫిన్ సెంటర్లు, హోటళ్ల యజమానులు ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. గ్యాస్ కొరతను అడ్డం పెట్టి ఇష్టమొచ్చినట్లుగా దోపీడికి గురి చేస్తున్నారు.
తాజాగా వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలను ఆసరాగా చేసుకుని అల్పాహారం, భోజనాల ధరలు అమాంతం పెరిగే ఆస్కారం ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదలతో గృహ అవసరాల వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడే ఆస్కారం ఉంది. దొడ్డి దారిలో హోటళ్లలో అక్రమ వినియోగం సాగే ఆస్కారం లేకపోలేదు. విపరీతమైన ధరల పెరుగుదలను తప్పించుకునేందుకు దొడ్డి దారిలో డొమెస్టిక్ సిలిండర్లతో వ్యాపారాలను నడిపించేందుకు నిర్వాహకులు పాకులాడేందుకు వీలుంది. ఈ దశలో ఈ అక్రమాలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన ఆస్కారం ఉంది. లేదంటే విచ్చలవిడిగా గృహ అవసరాల సిలిండర్లు పక్కదారి పట్టి అసలుకే మోసం జరుగనుంది.