కంఠేశ్వర్, అక్టోబర్ 6 : జిల్లాలోని ఆయా మండలాల్లో అసైన్డ్, భూ దాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి సబ్కలెక్టర్లు, ఆర్డీవో, అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అసైన్డ్, భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సర్వేయర్లతో పక్కాగా సర్వే చేపట్టి విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్ తదితర సమగ్ర వివరాలను సేకరించాలని, జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
గ్రామాల వారీగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల కన్నా ముందు ఆన్లైన్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే అర్జీలను ఆయా మాడ్యుల్స్లో విభజించిన నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీవో రాజేంద్రకుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ అశోక్, తహసీల్దార్లు, సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు.