జక్రాన్పల్లి, నవంబర్ 23: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, ఆదర్శ పాఠశాలను శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్కు వెళ్లిన ఆయన.. సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతతోపాటు విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని సైతం క్షుణ్ణంగా పరిశీలించారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు, వంటకు వినియోగించే పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్టోర్రూమ్లో గోధుమ పిండి ఇతర ప్యాకెట్లు తెరిచి ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. అవి కలుషితం కాకుండా జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. విద్యార్థినులను పలుకరించి వారికి అందిస్తున్న భోజనం, సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్యపై ఆరా తీశారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి తదితరులు ఉన్నారు.