కంఠేశ్వర్, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిచర్యలు చేపట్టామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు, సీపీ కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 13న పోలింగ్, జూన్ 4న డిచ్పల్లి సీఎంసీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.
గతంలో జిల్లాలోని ఐదు అసెం బ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓట్లనే ఇక్కడ లెక్కించారని, ఈసారి మాత్రం నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని మొత్తం ఏడు అసెం బ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లన్నీ ఒకేచోట లెక్కిస్తామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎంసీసీ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్కాడ్, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘనపై ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, సీ-విజిల్ యాప్ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచు తుందన్నారు.
85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసేలా వెసులుబాటు ఉందన్నారు. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలతోపాటు ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. జిల్లాలో మొత్తం 18 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించిన నగదుతో ప్రయాణించొద్దని, తనిఖీల్లో జప్తు చేసిన సొమ్మును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ ఐఏఎస్ కిరణ్మయి, ట్రెయినీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 28లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్తో కలిసి ప్రారంభించారు.