ఖలీల్వాడి/ నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 9 : నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందానని.. యువత, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలిచి ప్రజాసేవకు పునరంకితమవుతానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆర్టీవో కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పలు ఆలయాల్లో పూజలు చేసి, తన నివాసం నుంచి కార్యకర్తల భారీ ర్యాలీ మధ్య నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు నగరంలోని బాజిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. అంతకుముందు సారంగాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి యజ్ఞం నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబసభ్యులతో కలిసి నగరంలో ప్రధాన రహదారి గుండా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. పదవిలో ఉన్నవారు హుందాగా ఉండాలని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రజల కోసం పనిచేయాలని, ప్రజలు మెచ్చేలా ఉండాలన్నారు. సుధీర్ఘ తన రాజకీయ జీవితంలో ఇదే స్ఫూర్తితో పని చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నదని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, చేతులు ఎత్తివేశారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ప్రజలకు తెలుసని అన్నారు. ఈనెల 30న నిర్వహించే పోలింగ్లో తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, బాజిరెడ్డి సతీమణి వినోదమ్మ, నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి, రూరల్ ఇన్చార్జి వీజీ గౌడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ పాల్గొన్నారు.
ఖలీల్వాడి, నవంబర్ 9 : రాష్ట్ర శాసనభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం 33 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుంచి ఎస్కే మాజిద్ (మజ్లిస్ బచావో త్రెహీక్), ఆశన్నగారి జీవన్రెడ్డి (బీఆర్ఎస్), తాళ్లపల్లి శేఖరయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), గండికోట రాజన్న (బీఎస్పీ), పి.వినయ్కుమార్రెడ్డి (కాంగ్రెస్) నామినేషన్లను సమర్పించారని తెలిపారు. బోధన్ సెగ్మెంట్ నుంచి పి.సుదర్శన్రెడ్డి (కాంగ్రెస్), మోసిన్ (ఎం-సీపీఐ), డి.నాగరాజు (ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్), వి.మోహన్రెడ్డి (బీజేపీ), మహ్మద్ షకీల్ ఆమేర్ (బీఆర్ఎస్), షేక్ జలీల్ (స్వతంత్ర), సాయం మురళి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. బాన్సువాడ సెగ్మెంట్ నుంచి పరిగె భాస్కర్రెడ్డి (స్వతంత్ర), పందిర గంగామణి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
అర్బన్ నియోజకవర్గం నుంచి మహ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), బి.లలిత (స్వతంత్ర), పడకంటి రాము (స్వతంత్ర), దత్తురాం ఖతల్ (రాష్ట్రీయ సమాజ్ పక్ష), దండి లత (బహుజన్ లెఫ్ట్ పార్టీ), బిగాల గణేశ్ గుప్తా (బీఆర్ఎస్), ఫజల్ కరీం (ఎన్సీపీ), మహేశ్ బిగాల (బీఆర్ఎస్), ఎం. శివకుమార్ (స్వతంత్ర), ధన్పాల్ సూర్యనారాయణ (బీజేపీ), మహ్మద్ మన్సూర్ అలీ (అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారని వివరించారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్), బాజిరెడ్డి జగన్మోహన్ (స్వతంత్ర), ఆర్. భూపతిరెడ్డి (కాంగ్రెస్), ఎం. శేఖర్ (బీఎస్పీ) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వేముల ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్), పల్లికొండ నర్సయ్య (బహుజన సమాజ్పార్టీ) ఎం. భోజన్న (ధర్మసమాజ్ పార్టీ), ముత్యాల సునీల్ కుమార్ (కాంగ్రెస్) అభ్యర్థులుగా నామినేషన్ వేశారని వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 70 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుంచి ఇప్పటివరకు 11 నామినేషన్లు, బోధన్ సెగ్మెంట్ నుంచి 13, బాన్సువాడ నుంచి 8, నిజామాబాద్ అర్బన్ నుంచి 21, నిజామాబాద్ రూరల్ నుంచి 10, బాల్కొండ నుంచి 7 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.