ఖలీల్వాడీ(మోపాల్), సెప్టెంబర్ 13 : విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితె జీవితాంతం సుఖపడవచ్చని, తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందన్నారు. మంగళవారం ఆయన మోపాల్ మండలంలోని కంజర ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ పాఠశాల, మోపాల్లో వెనుకబడిన తరగతుల బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ అన్ని విభాగాలను పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్రూమ్, టాయిలెట్స్ వద్ద ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. వారి ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నా యా అని అడిగి తెలుసుకున్నారు.
స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూ చించారు. సెల్ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మోపాల్ బీసీ బాలుర వసతిగృహంలో పలు లోపాలు కనిపించడంతో అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై మండిపడ్డారు. హాస్టల్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. పది రోజుల్లో తాను మళ్లీ వసతిగృహాన్ని తనిఖీ చేస్తానని, పరిస్థితిలో మార్పురాకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట బీసీ సంక్షేమాధికారి నర్సయ్య, కంజర రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవీలత, మోపాల్ ఎంపీవో ఇక్బాల్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి గర్భిణులకు సూచించారు. మోపాల్ వసతిగృహం తనిఖీ అనంతరం తిరిగి వెళ్తుండగా గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు చేయించేందుకు వెళ్తున్న 102 అంబులెన్స్ను గమనించారు. ఆశ కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.