కామారెడ్డి, మార్చి 15 : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని, అవసరం మేరకే వినియోగించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ప్రధాన సమావేశం మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆన్లైన్లో పలుయాప్లు చేస్తున్న గ్యాంబ్లింగ్తో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు. ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని, యువత అప్రమత్తంగా యాప్లను ఉపయోగించాలని సూచించారు.
వినియోగదారుల రక్షణకు ప్రభు త్వం 2019లో వినియోగదారుల రక్షణ చట్టం తెచ్చిందని చెప్పారు. నష్టపోతే ఈ చట్టం ద్వారా పరిహారం పొందే హక్కుతోపాటు వస్తువు ఎంపిక చేసుకునే హక్కు, భద్రత, సమాచారం, విద్య, ఆరోగ్య హక్కులు పొందవచ్చని అన్నారు. సమావేశంలో డీఎస్వో మల్లికార్జున్ బాబు, జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బావయ్య, పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు రఘునందన్, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, వినియోగదారుల ఫోరం సభ్యులు పాల్గొన్నారు.