కామారెడ్డి, మార్చి 2: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 347ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
సహకార సంఘాల ఆధ్వర్యంలో 325, ఐకేపీ ఆధ్వర్యంలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాసంగిలో వచ్చే వరి పంట దిగుబడిని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.