గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి పన్ను చెల్లింపులు ఎంత కీలకమో అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 76.96శాతం వసూలు చేశారు.
నిజామాబాద్ జిల్లా పంచాయతీ విభాగం పన్నుల వసూళ్లలో దూకుడు ప్రదర్శిస్తున్నది. 2023- 24 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేందుకు మరో 46 రోజులు మిగిలి ఉండగానే దాదాపు 76.96 శాతం పన్నుల వసూళ్లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి లక్ష్యానికి చేరువవుతామన్న ధీమాతో పంచాయతీ విభాగం అధికారులు ఉన్నారు. మొన్నటి వరకు ఎన్నికలతోపాటు పథకాల దరఖాస్తుల స్వీకరణ తదితర పనుల్లో బిజీగా ఉన్న సిబ్బంది.. ఇప్పుడు పన్నుల వసూళ్లకు ప్రాధాన్యమివ్వడంతో పురోగతి వచ్చింది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, పన్నుల వసూళ్లపై లక్ష్య నిర్దేశం, నిరంతర సమీక్షలు, పంచాయతీలకు అందుబాటులో కార్యదర్శులు.. తదితర సానుకూల అంశాలు పన్నుల వసూళ్లలో త్వరితగతిన పురోగతి సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించి పర్యవేక్షణ, పనిఒత్తిడి ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాటిని అధిగమించి పన్నుల వసూళ్లలో పురోగతి సాధించారు.
పన్నుల వసూలులో వెనుకబడ్డ మండలాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి గ్రామాల వారీగా పురోగతి తెలుసుకొని, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు లక్ష్యాన్ని సాధించేలా పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ పన్ను చెల్లిస్తే
కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్లతో ఇంటింటికీ తిరిగి వసూళ్లు నిర్వహించడంతో మొండి బకాయిలు సైతం వసూళ్లవుతున్నాయి. దాదాపు మండలాలన్నీ కొద్దిపాటి దూరంలోనే ముందు, వెనుకలో ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయి. గతంలో పన్ను వసూలు కాక పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో నిధులు లేక సిబ్బంది వేతనాలకు, కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందులు ఎదురయ్యేది. పంట డబ్బులు చేతికివచ్చిన సమయంలో పక్కా ప్రణాళికతో ప్రక్రియ చేపట్టడంతో వసూళ్లు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో కనీస అవసరాలైన తాగునీటి సరఫరాకు మరమ్మతులు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పంచాయతీ ట్రాక్టర్ నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, సిబ్బంది వేతనాలతోపాటు ఇతరాత్ర అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.
జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా 2,75,000 నివాసాలు ఉన్నాయి. మండలాల వారీగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (పన్నుల డిమాండ్) ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 26,80,09,190 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ. 20,62,47,707 వసూలు చేయగా, ఇంకా రూ. 6,17,61,483 వసూలు చేయాల్సి ఉన్నది. వేల్పూర్ 80.58 శాతం, నిజామాబాద్ రూరల్ 80.03 శాతంతో ఈ రెండు మండలాలు జిల్లాలో ముందు వరుసలో ఉండగా, ఎడపల్లి 75.06 శాతం, మోస్రా 75.07 శాతంతో వెనుకంజలో ఉన్నాయి.