భిక్కనూరు, ఫిబ్రవరి 21: ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం ఆమె భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నూట్రిషన్ కిట్తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణుల సంరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో గర్భిణుల ఆరోగ్యంపై అధ్యయనం చేసిన తర్వాతే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రారంభించారని వివరించారు. బలహీనత లేకుండా పుట్టిన పిల్లలను ఆరు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంచితే వారు జీవితాంతం ఆరోగ్యం ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని, న్యూట్రిషన్ కిట్పై అవగాహన కల్పించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోళికేరి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.
గర్భిణులు సాధారణ ప్రసవాలు చేసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. 18 ఏండ్లు వచ్చే వరకూ ఆడపిల్లలకు పెండ్లి చేయవద్దని సూచించారు. ఇద్దరు పిల్లలు ఉన్న మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ప్రసవమైన గంటలోపు పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్మితా సబర్వాల్ సందర్శించారు. చిన్నారులు, గర్భిణులకు అందించే పౌష్టికాహారం వివరాలను అడిగి తెలసుకున్నారు. ఆరోగ్యలక్ష్మి ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణులకు హిమోగ్లోబిన్ 14 శాతం ఉండేలా చేసుకోవాలని సూచించారు. అనంతరం కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. అర్హత గల వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఎంతమందికి కంటి పరీక్షలు చేశారని వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకొన్నారు.కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సర్పంచ్ తునికి వేణు, జడ్పీటీసీ పద్మ, ఎంపీపీ గాల్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, భిక్కనూరు మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, ఉప సర్పంచ్ నరేశ్, డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ , ఉప వైద్యాధికారులు చంద్రశేఖర్, శోభారాణి, వైద్యాధికారిణి యేమీమా, వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.