డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడలో వేలాది ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తాడ్కోల్ శివారులో ఏకంగా 1004 ఇండ్లు పూర్తి కావడంతో పాటు గృహ ప్రవేశాలు సైతం చేయడంతో ప్రత్యేక గ్రామంగా రూపాంతరం చెందింది. కేసీఆర్ నగర్.. పీఎస్ఆర్ కాలనీగా నామకరణం చేసిన కాలనీలో సకల వసతులు కల్పించారు. 28 ఎకరాల్లో జీ ప్లస్ -1 పద్ధతిలో నిర్మితమైన ఇండ్ల సముదాయంలో మరో వెయ్యి ఇండ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మానవీయ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి స్పీకర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో 11వేల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే ఏడు వేల ఇండ్ల గృహ ప్రవేశాలు సైతం పూర్తయ్యాయి. తాడ్కోలు శివారులో నిర్మితమైన కేసీఆర్ నగర్లో భూమి విలువతో కలుపుకొంటే ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటి విలువ రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు అవుతుంది. వెయ్యి ఇండ్లకు మొత్తం రూ.200 కోట్లు విలువ చేసే సంపద పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ అయినట్లే..
-నిజామాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బాన్సువాడ
కష్టాల్లో మమ్ములను ఆదుకున్నరు..
నాది బాన్సువాడ పట్టణంలోని గూడెంగల్లీ. నా భర్త చనిపోయిండు. నాకు కుమారుడు ఉన్నడు. ఉండేందుకు ఇల్లు లేదు. పోచారం సార్కు ఇల్లు కోసం అడిగినా. నా పరిస్థితి చెప్పుకున్న. వెంటనే తహసీల్దార్ సార్కు, పెద్దసార్లకు దరఖాస్తు పెట్టుకోమన్నడు. ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇస్తే మంచిగుండదు అని చెప్పిండు. సీఎం కేసీఆర్ వచ్చినంక బాన్సువాడకు ఇన్ని పనులైతున్నాయి అని అన్నడు సారు. శనివారం ఇంటిపత్రం, ఇల్లు తాళం ఇచ్చిండు. కష్టాల్లో ఉన్న మమ్ములను ఆదుకున్నరు.
– ఒడ్డె గంగామణి, గూడెంగల్లీ, బాన్సువాడ
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నది. తన నియోజకవర్గంలో గూడు లేని పేదలుండకూడదని ప్రకటించి అందుకు తగ్గట్లుగా వేలాది ఇండ్ల నిర్మాణాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ముందడుగు వేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అత్యధికంగా ఇండ్లను మంజూరు చేయించుకొని చకచకా నిర్మాణాలు చేపట్టి పేదలకు అందిస్తున్నారు. వేలాది గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి కాగా తాజాగా మరో 504 ఇండ్లను పంపిణీ చేయడంతో తాడ్కోల్ శివారులో కేసీఆర్ నగర్… పీఎస్ఆర్ కాలనీ ప్రత్యేకతను సంతరించుకున్నది.
పోచారం శ్రీనివాస రెడ్డి తలపెట్టిన డబుల్ ఇండ్ల నిర్మాణాల్లో సకల వసతులు కల్పిస్తున్నారు. జనవరి 28న జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా రూ.90లక్షలతో కల్యాణ మండపం నిర్మాణానికి సైతం భూమి పూజ చేశారు. అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ నల్లాలు, మురుగునీటి వ్యవస్థ ఇలా అనేక సదుపాయాలను కల్పించారు. 28 ఎకరాల్లో జీ ప్లస్ 1 రూపంలో నిర్మితమైన 1004 డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో మరో వేయి గృహాలను నిర్మించేందుకు స్పీకర్ నిశ్చయించుకోవడం విశేషం.
‘డబుల్’ ఇండ్లకు కేరాఫ్ బాన్సువాడ..
డబుల్ ఇండ్ల నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా బాన్సువాడ నియోజకవర్గం నిలిచింది. వేలాది సంఖ్యలో జరిగిన నిర్మాణాలే ఇందుకు కారణం. కేసీఆర్ సర్కారు తీసుకువచ్చిన ఈ పథకాన్ని ధైర్యంగా పేద ప్రజల కోసం ఒకడుగు ముందుకేసి పోచారం శ్రీనివాస రెడ్డి అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం అందిస్తున్న మొత్తం నిధుల ద్వారా నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం పలు సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేసింది. సంకల్పం గట్టిదైతే ఎలాంటి పనినైనా పూర్తి చేయొచ్చని భావించిన సభాపతి ధైర్యంగా ముందడుగు వేశారు.
కాంట్రాక్టర్లతో స్వయంగా మాట్లాడి ఇదొక మానవీయ కార్యక్రమమని అవగాహన కల్పించారు. ఇందులో లాభాలను ఆశించొద్దని సూచించి వారితో ఇండ్లను కట్టించే ప్రయత్నాలు చేయించారు. రాష్ట్రంలోనే ఇంత భారీ స్థాయిలో డబుల్ ఇండ్లు నిర్మితం కావడం పోచారం శ్రీనివాస రెడ్డి చిత్తశుద్ధి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పమే కారణం. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నిత్యం ప్రజలతోనే మమేకమయ్యే సభాపతి కార్యదక్షత నేటితరానికి ఎంతో ఆదర్శం. వారంలో సగానికి ఎక్కువ రోజులు బాన్సువాడలోనే మకాం వేసి, ప్రోటోకాల్ను పక్కన పెట్టి సామాన్య ప్రజల ఇక్కట్లు తీర్చే వ్యక్తి స్పీకర్ కావడం విశేషం.
డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం..
దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం మన రాష్ట్రంలో అమలవుతున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ ఆలోచనే కారణం. ఆయన మదిలో నుంచి వచ్చిన ఈ పథకం ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు మేలు జరుగుతున్నది. గతంలో సమైక్య పాలకులు బొటాబొటిన సాయం చేసి చేతులు దులుపుకొన్నారు. మంజూరయ్యే సాయం చేతికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడలా కాదు. పేదలకు అందించే డబుల్ ఇండ్ల నిర్మాణంలో వారి వాటా శూన్యం. ప్రభుత్వమే పూర్తిగా రాయితీని భరించడం గొప్ప విషయం. నా నియోజకవర్గంలో మొత్తం 11వేల ఇండ్లు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడం నా అదృష్టం. ఇప్పటికే ఇందులో 7వేల ఇండ్లను పంపిణీ చేశాం. మిగిలిన ఇండ్ల నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి.
– పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన సభాపతి
హమారా గరీబ్ లోగోంకా ఆశీర్వాద్ రహితే…
గరీబ్లోగోంక ఆద్మీ పోచారం సాబ్ . జిందగీ మే సాబ్కు యాద్ఖ్ల్రేతే. కోన్బీ ఇత్నా అచ్చకామ్ నహీకరే. బాన్సువాడ బోలేతో పోచారం సాబ్, పోచారం సాబ్ బోలేతో బాన్సువాడ హైసా హై. కిదర్బీ దేఖో బాన్సువాడ డెవలప్మెంట్ బహుత్ అచ్చాఖరే. పోచారం సార్ పహిలేసే సబ్ లోగోంకు మిలాఖే చల్తే. సాబ్ కే బారేమే కిత్నా బోలునా కం రహెతే . కుచ్బీ రహిందేవ్ గరీబ్లోగోంకా భగవాన్ హై సాబ్ .
– మరియాన్ బేగం, బాన్సువాడ
పైసా ఖర్చు కాలేదు..
డబుల్ బెడ్ రూం ఇల్లు పొందేందుకు మాకు అర్హతలున్నయి. మా పరిస్థితి చూసి సార్కు చెప్పుకున్నం. దరఖాస్తు చేసుకున్నంక ఎంక్వైరీ చేసిండ్రు. ఎవరికీ పైసా ఇవ్వలేదు. పోచారం సార్ లాంటోళ్లు లీడర్గా ఉండడం మా అదృష్టం. ఇప్పటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవాలంటే కష్టమైన పని. నిజంగా దేవుడిలా మాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నారు.
– అనిత, సంగమేశ్వర కాలనీ, బాన్సువాడ
ఒక్కో ఇల్లు విలువ రూ.20లక్షలపైమాటే..
బాన్సువాడ పట్టణం శరవేగంగా వృద్ధి చెందుతున్నది. ఇందులో పట్టణంలో ఏ మూలకు వెళ్లినా వ్యవసాయ, నిర్మాణ స్థలాల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం చదరపు గజం ధర రూ.10వేలకు తక్కువ ఎక్కడా లభ్యమయ్యే పరిస్థితి బాన్సువాడలో లేదు. తాడ్కోలు శివారులో నిర్మితమైన కేసీఆర్ నగర్లో భూమి విలువతో కలుపుకొంటే ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు విలువ రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు పలుకుతున్నది. వేయి ఇండ్లకు మొత్తం రూ.200 కోట్లు విలువ చేసే సంపదను పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ అయ్యింది. రెక్కాడితే కానీ డొక్కాడని అనేక పేద కుటుంబాలకు చెందిన వారికి రూ.20లక్షలు వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకోవడం అంటే కత్తిమీది సామే. అంతటి స్థోమత లేని కుటుంబాలకు పూర్తి ఉచితంగా ప్రభుత్వం ద్వారానే కేసీఆర్ ఆశయం మేరకు పోచారం శ్రీనివాస రెడ్డి అర్హులను గుర్తించి డబుల్ ఇండ్లను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేసీఆర్ నగర్లోని ఇండ్ల నిర్మాణాలను వివిధ జిల్లాలకు చెందిన నిర్మాణదారులు, ప్రజా ప్రతినిధులంతా వరుస కట్టి సందర్శనకు వస్తుండడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది.
వసతులు బాగున్నయ్..
ఇంటి ముందు ఏమన్న జరిగితే పట్టించుకోని సమాజం ఇప్పుడున్నది. అలాంటి మాలాంటోళ్ల కోసం అన్నీ తానై పోచారం సార్ మాకు ఇండ్లు కట్టించివ్వడం చాలా సంతోషంగా ఉన్నది. సొంతిళ్లు రావడం ఆనందంగా ఉన్నది.
– గిర్మి నాగమణి, గుడేంగల్ల్లీ, బాన్సువాడ