వేల్పూర్ ఎక్స్ రోడ్లో రేపు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు వెల్లువలా తరలిరావాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. స్పైసెస్ పార్కు ఆవరణలో నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి వేముల మంగళవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్, తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించేందుకు స్వచ్ఛందంగా రావాలని కోరారు. అధికారం, పదవుల కోసం ఎంతకైనా తెగించిన కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అవకాశమిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు.
వేల్పూర్, అక్టోబర్ 31 : వేల్పూర్ మండల కేంద్రంలోని స్పైస్ పార్కులో ఈనెల 2వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్పైస్ పార్కులో విలేకరులతో మాట్లాడారు. వేల్పూర్ ఎక్స్ రోడ్డు స్పైస్ పార్కు మైదానంలో ఈ నెల 2న మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కేసీఆర్, తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్గా నిలిపారన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, ఐటీ ఉద్యోగాలు, గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పెంపొందించడంలో తెలంగాణను ప్రథమస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్యాగధనుడు సీఎం కేసీఆర్ ఒకవైపు.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన ద్రోహి కిషన్రెడ్డి మరొక వైపు ఉన్నారన్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఆలోచన చేయాలని కోరారు.
కొత్త ప్రభాకర్పై కత్తితో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల అన్నారు. ప్రజాస్వామికవాదులు తలదించుకునే పరిస్థితి ఉందన్నారు. కటాని రాజు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యుడని, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. ఒక ఎంపీని కత్తితో పొడవడం దారుణమని, అభ్యర్థులను అంతమొందించాలనుకోవాలనే ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి నేరచరిత్రనే అని విమర్శించారు. గతంలో హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి వందల మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. సీఎం పదవి కోసం ఎంతమందినైనా బలి తీసుకునే రకం కాంగ్రెస్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్ ఎన్నికల సమయంలో, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపైకి తుపాకీతో రేవంత్రెడ్డి వెళ్లాడని అన్నారు. రేవంత్రెడ్డి అంటేనే హింసను ప్రేరేపించే వ్యక్తి అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో బీఆర్ఎస్ తరపున ఈ ఘటనపై ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. సమావేశంలో మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, మోర్తాడ్ జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, వేల్పూర్ ఉపసర్పంచ్ పిట్ల సత్యం, రాజ్కుమార్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం కొనసాగుతున్న ఏర్పాట్లను మంత్రి వేముల మంగళవారం సాయంత్రం పరిశీలించి, పలు సలహాలు, సూచనలు చేశారు. 55 వేల మందితో సభను నిర్వహించే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.