కమ్మర్పల్లి/వేల్పూర్/మెండోరా/ముప్కాల్/ బాల్కొండ, అక్టోబర్ 13: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి తల్లి మంజులమ్మ అంత్యక్రియలు స్వగ్రామం వేల్పూర్లో శుక్రవారం నిర్వహించారు. వేల సంఖ్యలో ప్రజలు, వేముల అభిమానులు హాజరై అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి మంజులమ్మ పార్థివదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మంజులమ్మ అంతిమ యాత్ర వేలాదిమంది జనం మధ్య సాగింది. ఈ సందర్భంగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ బీబీ పాటిల్, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, షకీల్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీలు , శేరి సుభాష్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఎల్.రమణ, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీ అర్వింద్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
వేముల కుటుంబంపై 24 ఏండ్లుగా ఉన్న ప్రేమ, అనుబంధాన్ని సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. మంజులమ్మ అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్.. మంత్రి ప్రశాంత్రెడ్డి, ఆయన సోదరుడిని అక్కున చేర్చుకొని ఓదార్చారు. 2016లో ప్రశాంత్రెడ్డి తండ్రి వేముల సురేందర్రెడ్డి కన్ను మూసినప్పుడు సైతం ఆయన వేల్పూర్కు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసిన సురేందర్రెడ్డిని ఎప్పటికప్పుడు గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో చేదోడువాదోడుగా బాధ్యతలు పంచుకుంటున్న మంత్రిని ‘నా తమ్ముడు ప్రశాంత్ రెడ్డి’ అని చెప్పి మరీ వేముల కుటుంబంపై ఆప్యాయతను చాటారు. సురేందర్రెడ్డి మృతిచెందాక వేముల సోదరులకు కష్ట కాలంలోనూ తండ్రి సమానుడిలా ఓదార్చి కన్నీళ్లుతుడుస్తున్నారు.
హాజరైన ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు
మంత్రి ప్రశాంత్రెడ్డి తల్లి మంజుల అంత్యక్రియల్లో అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకు ముందు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మంజులమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి మంత్రిని పరామర్శించారు. డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు : మంత్రి
తన తల్లి అంత్యక్రియలకు హాజరై తమ కుటుంబానికి ధైర్యం కల్పించిన శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు మంత్రి ప్రశాంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారని, తన తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన వచ్చి తనకు సీఎం కేసీఆర్ కొండంత మనో బలాన్ని ఇచ్చారని మంత్రి మేముల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.