కామారెడ్డి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సాక్షాత్తు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో సీఎం కేసీఆర్ పేరుండడంతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ స మీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు నిస్తేజంగా మారారు. సోమ, మంగళవారాల్లో నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంబురాలు నిర్వహించగా, కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారు. ఓ వైపు కేసీఆర్తో పోటీకి సై అంటూనే, మరోవైపు ఇక తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఇక సాధ్యం కాదని నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ‘ముందు నుయ్యి-వెనుక గొయ్యి’లా మారింది.
కేసీఆర్ సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి
సీఎం కేసీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంపగోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతోపాటు కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయాలు, విద్యాలయాలు, రోడ్లు, భవనాలు ఇలా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చుతామని ప్రకటించారు. ఆ మేరకు కామారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. విద్యారంగంలో కామారెడ్డి ప్రస్తుతం టాప్లో ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేకసార్లు జిల్లాలో పర్యటించి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. బ్రిగేడియర్గా పని చేయడంతోపాటు జల సాధన దీక్షలో పాల్గొని నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతులు చేశారు. ఈ ప్రాంత ఉద్యమకారులు, విద్యావంతులు, న్యాయవాదులతో పలుమార్లు చర్చించిన సందర్భాలూ ఉన్నా యి. వీటన్నీంటికీ తోడు కేసీఆర్ తల్లిదండ్రులైన రాఘవరావు, వెంకటమ్మ బీబీపేట మండలం కోనాపూర్ (పోసానిపేట)లో నివసించారు. ఎగువమానేరు రిజర్వాయర్ నిర్మాణ సమయంలో సాగుభూములు ముంపునకు గురవ్వడంతో ఇక్కడి నుంచి చింతమడకకు వలస వెళ్లారు. రాజంపేట మండలం ఆర్గొండలోని తన మేనమామ ఇంట్లో కేసీఆర్ బాల్యం గడిపినట్లు పలుమార్లు చెప్పారు. ఇలా కేసీఆర్కు కామారెడ్డి నియోజకవర్గం కొత్త ఏమీ కాదని, ఆయనకు ఈ ప్రాంత ప్రజలు, మేధావులు, విద్యావంతులతో పరిచయాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ ఖతం
బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీతో ఇక కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. 2009లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆయన తెలంగాణ ఉద్యమసమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్ఎస్లో చేరి భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఆయన, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. వందల కోట్లతో అభివృద్ధి చేశారు. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు పన్నాగాలు చేస్తూ, అసంతృప్తి నేతలను ఆ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. తమ గెలుపు ఖాయమనే రీతిలో ప్రచారం చేసుకున్నారు.
సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసిన నాయకుడిపై ఎంతో కొంత వ్యతిరేకత వస్తే, దాన్ని తమవైపు మలుచుకొనేందుకు యత్నించారు. కానీ వారి ఆగడాలకు ఫుల్స్టాప్ పెడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీకి సై అనడంతో ప్రస్తుతం ఆ పార్టీ తీవ్రమైన షాక్లో ఉన్నది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న కామారెడ్డిలో ఇక తమ ఆటలు సాగవని, ఇక్కడ కేసీఆర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. తాము ఎంత కష్టపడినా, గెలుపు మాత్రం బీఆర్ఎస్నే వరిస్తుందని, తమ భవితవ్యం ప్రశ్నార్థకమేనని ఆవేదన చెందుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, రాజంపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచనలోపడ్డారు. మాచారెడ్డి మండలంలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడిన మాటలతోనే ఈ విషయం తేటతెల్లమయ్యింది. సోమవారం సైతం కామారెడ్డిలో డీసీసీ నాయకులు నిర్వహించిన ప్రెస్మీట్లోనూ ఓటమి భయం కనిపించింది.