గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు కదా, నాలుగు బిందెల నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాలవి. కానీ, తెలంగాణ సిద్ధించాక పరిస్థితి మారిపోయింది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో క‘న్నీటి’ కష్టాలకు కాలం చెల్లింది. మిషన్ భగీరథ పుణ్యమా అని కామారెడ్డికి పుష్కలంగా తాగునీరు తరలివచ్చింది. అయితే, ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించే పైపులు ఎన్హెచ్ఏఐ పనుల వల్ల దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. వాటి స్థానంలో కొత్తవి, మరింత నాణ్యమైనవి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. రూ.195 కోట్లు మంజూరుచేశారు. ఈ పనులు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు మరింత మెరుగ్గా, నిరంతరంగా నీటి సరఫరా జరుగనున్నది.
– నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భౌగోళికంగా ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కామారెడ్డి నియోజకవర్గం గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడేది. కామారెడ్డి నియోజకవర్గానికి సాగు, తాగు నీటికి అనేక ఆటుపోట్లు ఎదురయ్యేవి. ఎక్కువగా ఈ ప్రాంతంలోని రైతన్నలంతా భూగర్భ జాలలపైనే ఆధారపడేది. ఎండాకాలం వస్తే గుక్కెడు మంచినీళ్లకు ఈ ప్రాంత వాసులు గతంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న దుస్థితి నిత్యం కనిపించేది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత గడప గడపకూ మంచి నీళ్లు అందుతున్నాయి. ఇందులో కామారెడ్డి నియోజకవర్గానికి సైతం తాగునీటి సౌకర్యం పెరిగింది. మండుటెండల్లోనూ ఇక్కట్లు శాశ్వతంగా లేకుండా పోయాయి. కాకపోతే ఎస్సారెస్పీ నుంచి శుద్ధి చేసిన నీళ్లను తరలించే క్రమంలో గతంలో వేసిన పైప్లైన్లు నిత్యం రిపేర్లకు గురి కావడంతో అంతరాయం వేధిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ రూ.195కోట్లు మంజూరు చేసి పైప్లైన్ మార్పునకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేరిట విడుదలైన జీవో అనుసరించి మిషన్ భగీరథలో భాగంగా పైప్లైన్ మార్పు దాదాపుగా 47 కిలో మీటర్లు మేర జరుగనున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ గోదావరి జలాలను శుద్ధికి తీసుకునే ప్రాంతం జలాల్పూర్ నుంచి అర్గుల్ వరకు పాత జీఆర్పీ పైప్లు 900 మి.మీ మందం గలవి ఉన్నవి. దీని స్థానంలో 16.5 కిలో మీటర్లలో 900 మి.మీటర్లు మందం గల ఎంఎస్ పైపులు మార్చుతారు. అర్గుల్ నుంచి ఇందల్వాయి నీటి శుద్ధి కేంద్రానికి 800 మి.మీటర్లు, 700 మి.మీటర్లు మందం గల జీఆర్పీ పైపుల స్థానంలో 14 కిలో మీటర్లు పొడవునా 700 మి.మీటర్ల ఎంఎస్ పైపులు అమర్చుతారు. ఇక ఇందల్వాయి నుంచి కామారెడ్డి జిల్లాలోని మల్లన్నగుట్ట నీటి శుద్ధి కేంద్రం వరకు 16.62 కిలో మీటర్లు మేర 700 మి.మీటర్లు జీఆర్పీ పైపుల స్థానంలో 700 మి.మీటర్లు మందం గల ఎంఎస్ పైపులు వేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం రూ.195 కోట్లు వ్యయం కాబోతుండగా సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. సమైక్య పాలనలో ప్రజలకు గుక్కెడు మంచి నీళ్లు తాగేందుకు లేకున్నా పట్టించుకున్నా వారు మచ్చుకూ కనిపించలేదు. ఇప్పుడు అలాంటి దుస్థితిమచ్చుకైనా కనిపించకపోవడం సీఎం కేసీఆర్ దార్శనికతకు
కాకతాళీయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కామారెడ్డి నియోజకవర్గం ఈ రెండు ప్రాంతాలు జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్నవే. కాకపోతే పైప్లైన్ అమరిక మాత్రం గుట్టలు, రాళ్లు, రప్పలు, అటవీ ప్రాంతాన్ని దాటుకుని ఇంటింటికీ చేరుకుంటున్నది. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలోనే జీఆర్పీ పైపులు వేశారు. కొన్ని చోట్ల అడవుల గుండా వెళ్లిన చోట పైప్లైన్ సామర్థ్యం బాగానే ఉన్నది. కాకపోతే జాతీయ రహదారి వెంట గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన పనుల మూలంగా పైప్లైన్ దెబ్బతిన్నది. ఎన్హెచ్ఏఐ నిర్వాకంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్తవి, మరింత నాణ్యమైన పైపుల ను వేయను న్నది. దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి తాగు నీటి గోసకు చెక్ పడినట్లే.
ఉభయ నిజామాబాద్ జిల్లాకు మిషన్ భగీరథ నీటి కి సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే ఆయువుపట్టులా నిలుస్తున్నాయి. సింగూర్ పరిధిలో 819 ఆవాసాలకు నీళ్లు అందేలా ఏర్పాట్లు చేశారు. ఎస్సారెస్పీ నీటి ద్వా రా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు మొత్తం 554 గ్రామాలకు తాగునీటి పథకం వర్తిస్తున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మిషన్ భగీరథ అంతరాయం పూర్తిగా తొలిగిపోనున్నది. కామారెడ్డి నియోజకవర్గంలోని మొత్తం మండలాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి మండలాలకు మేలు చేకూరుతుంది.
కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చింది సీఎం కేసీఆరే. దశాబ్దాలుగా తాగునీటి కోసం అల్లాడిపోయిన ఈ ప్రాంతానికి శుద్ధజలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రిది. అయితే, పాత పైపులు తరచూ పగిలిపోతుండడం మూలంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతున్నది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే నిధులు మంజూరుచేశారు. నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
– గంప గోవర్ధన్, కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిషన్ భగీరథ పథకానికి బీజం వేసి కొద్ది సమయంలోనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని పూర్తి చేసి నేడు ఇంటింటికీ సీఎం కేసీఆర్ తాగు నీటిని అందిస్తున్నారు. తద్వారా దశాబ్దాల సమస్యలకు చెక్ పడింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ప్రజల మేలు కోసం రూ.195కోట్లతో ఎంఎస్ పైపులు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించడం గొప్ప విషయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్కే సాధ్యం.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి